జగన్, చంద్రబాబుకు ట్వీట్ చేసిన జేడీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను పార్లమెంటులో ఏపీ ఎంపీలంతా నిలదీయాలని జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గర్జనలో ఇచ్చిన హమీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 'విశాఖ ఉక్కు గర్జనలో,అన్ని రాజకీయ పార్టీలు (బీజేపీయేతర) వైజాగ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవడానికి, అలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చేపట్టడానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చాయి. వారు చేస్తారని ఆశిస్తున్నాను #Savevizagsteel'అని జేడీ నినదించారు. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా ట్యాగ్ చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ విషయంపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ కొనసాగుతున్న సమయంలోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరాలని సూచించారు. పార్లమెంటు వేదికగా పోరాడతామని చెప్పారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ధోరణితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ప్రయివేటీకరిస్తామని చెబుతోంది. అయితే లాభాల్లో ఉన్న ప్లాంటును ఎలా విక్రయిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడాదికిపైగా కార్మికులు దీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన వీవీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచే పోటీచేస్తానని, అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు.