వైఎస్ జగన్ 'వ్యూహం'పై వర్మ కొత్త వ్యూహం
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వ్యూహం. షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. వాస్తవానికి ఈనెల 10వ తేదీనే ఇది విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమాలో నిజ జీవితంలోని పాత్రల పేర్లు, వాళ్ల ప్రవర్తన, రాజకీయ సంఘటనలు అన్నీ వ్యూహంలో ఉన్నాయి.
ఈ సినిమా విడుదలైతే రాజకీయ దుమారం రేగడం ఖాయమంటున్నారు. ఎన్నికలు జరిగే సమయం దగ్గర పడుతుండటంతో కచ్చితంగా గొడవలు వస్తాయని భావించిన సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి వైసీపీని ఏర్పాటు చేయడం.. అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. సెన్సార్ అడ్డుకోవడంతో యూట్యూబ్ లో నేరుగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడంట.

గతంలో ఆర్జీవీ సినిమాలను నేరుగా యూట్యూబ్ లో విడుదల చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అదే చేయాలని భావిస్తున్నారంట. వ్యూహం సినిమాను తీసేటప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయని ముందే ఊహించారని, అందుకే ఆయన ముందస్తు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ సినిమాను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలో తనకు బాగా తెలుసని మీడియాతో అన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
మొదటి భాగం పేరు వ్యూహం, రెండో భాగం పేరు శపథం. జనవరి 25న శపథం సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అది కూడా విడుదలవడం కష్టమని భావిస్తున్నారు. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో థియేటర్లో విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా కానీ వ్యూహం సినిమాను కచ్చితంగా ప్రజల్లోకి తీసుకువస్తామని వర్మ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications