వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ - ఒంగోలుకు హెలికాఫ్టర్ లో బాలయ్య..!!
నందమూరి బాలయ్య - చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇద్దరి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఈ రోజు.. 8న జరగనున్నాయి. ఈ ఇద్దరి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల కు అడ్డంకులు తొలిగిపోయాయి. సంక్రాంతికి విడుదల అవుతున్న బాలయ్య వీరసింహారెడ్డి ఒంగోలు.. చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటతో ప్రభుత్వం సభల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ జీవో తీసుకొచ్చింది. దీని ప్రభావంతో ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల అనుమతి పైన పడింది. కానీ, చర్చల తరువాత ఒంగోలులో ఈ సాయంత్రం వీరసింహారెడ్డి ..అదే విధంగా 8వ తేదీన విశాఖ కేంద్రంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లకు లైన్ క్లియర్ అయింది. రెండు ఈవెంట్లను వేదికల్లో మార్పు జరిగింది.
ఏయూ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ఈవెంట్..
చిరంజీవి అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తన్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈ నెల 8వ తేదీన విశాఖలో జరగనుంది. దీనికి సంబంధించి మూవీ మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక ను తొలుత విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవోతో అడ్డంకులు ఏర్పడ్డాయి. తాత్కాలికంగా ఈవెంట్ పనులకు బ్రేకులు పడ్డాయి. మావీ మేకర్స్ - అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఫలితంగా ఆర్కే బీచ్ కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకొనేందుకు అధికారులు సూచించారు. దీనిని నిర్వాహకులు అంగీకరించారు. దీంతో, 8వ తేదీన ఖరారు చేసిన సమయానికే విశాఖ కేంద్రంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
నేడు ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్..
సంక్రాంతి రేసులో నిలిచిన నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం ఒంగోలు కేంద్రంగా జరగనుంది. ఈ ఈవెంట్ కోసం తొలుత నిర్ణయించిన వేదిక గురించి తాజా జీవో జారీతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత జరిగిన చర్చల ఫలితంగా ఒంగోలు ఎబీఎం కాలేజీలో తొలుత ఈవెంట్ నిర్వహణకు నిర్ణయించగా, ఇప్పుడు వేదిక మారింది. ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా ప్రాంగణానికి వేదిక మారింది. సాయంత్రం 6 గంటల నుండి తొమ్మిది గంటల వరకు కార్యక్రమం జరగనుంది. హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ సహా హాజరుకానున్న ప్రధాన తారాగణం హాజరు కానున్నారు. ఈ వేడుకలో భాగంగా మ్యూజిక్ డైరెక్ట్ తమన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు.
హెలికాఫ్టర్ లో ఒంగోలుకు బాలయ్య
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో బాలకృష్ణ ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఒంగోలు చేరుకోనున్నారు. ఈ సినిమా పైన బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య ను ప్రత్యక్షంగా చూసేందుకు.. ఆయన స్పీచ్ వినేందుకు అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. అయితే, పాసులు ఉన్న వారినే అనుమతిస్తామని నిర్వహాకులు స్పష్టం చేసారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వాహదారులకు రూట్లను బట్టి పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. ఇప్పుడు ఏపీ కేంద్రంగా బాలయ్య - చిరంజీవి ఇద్దరి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.