మూడు రోజుల పాటు భారీ వర్షాలు - ప్రాజెక్టులు ఫుల్ : కోస్తా జిల్లాలపై ప్రభావం..!!
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 15, 16 తేదీలలో తేలిక పాటి నుండి అక్కడక్కడా భారీ వర్షపాతంతో, తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీచనున్నట్లు వెలువడిన వాతావరణ హెచ్చరిక దృష్ట్యా మత్స్యకారులెవరూ సముద్రవేటకు వెళ్లవద్దని సూచించారు.
భారీ వర్షాల హెచ్చరిక
భారీ వర్షాలు, పెనుగాలల వల్ల అత్యవసర సేవలకు, జనజీవనానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలతో సంసిద్ధంగా ఉండాలని రక్షణ, సహాయక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.
రిజర్వాయర్లు ఫుల్..
సాగర్ఇన్ఫ్లో, అవుట్ ప్లో: 1,30,619 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ : 311.1486 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటని విడుదల చేశారు. సాగర్ ఇన్ప్లో 81,022 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ఫ్లో 1,22,374 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 885 అడుగులుగా ఉంది.
Recommended Video
కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో నష్టం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో..తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.