ఒంటిపై గాయాలు.. సన్నని వైరుతో.. శిరీషదీ హత్యేనా?: పోస్టుమార్టంలో షాకింగ్
ఫిలిం నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటిషియన్ శిరీషకు చెందిన పోస్టుమార్టం నివేదిక వెలుగు చూసింది. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పెదవ,
హైదరాబాద్: ఫిలిం నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటిషియన్ శిరీషకు చెందిన పోస్టుమార్టం నివేదిక వెలుగు చూసింది. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పెదవ, చెంపలపై గాయాలు ఉన్నట్లుగా రిపోర్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాజీవ్ కొట్టాడా, శిరీష అక్కడే చనిపోయిందా, చంపేశారా?: తెరపైకి ఆ యువతి
శిరీషది ఆత్మహత్యే అయితే ఆమె శరీరంపై గాయాలు ఎలా ఉన్నాయనేది ప్రశ్నగా మారింది. ఆమె ఆత్మహత్య అని చెబుతున్నారని, అదే నిజమైతే.. గాయాలు ఎలా వచ్చాయనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
పోస్టుమార్టం నివేదికతో సందేహాలు... హత్య చేశారా?
పోస్టుమార్టం రిపోర్టు నేపథ్యంలో శిరీషది హత్య కావొచ్చునని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఆమెను సన్నని వైరుతో గొంతు బిగించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం రిపోర్టు పూర్తి నివేదిక వస్తేనే అన్ని విషయాలు వెల్లడవుతాయి. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకున్నదన్న వార్తలు అబద్దం కావొచ్చునని అంటున్నారు. ఆమెను చంపేసి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసి ఉంటారని అంటున్నారు.
వేర్వేరుగా శ్రవణ్, రాజీవ్లను ప్రశ్నించారు
శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్లను పోలీసులు వేర్వేరుగా, కలిపి విచారించారని తెలుస్తోంది. తాను రాజీవ్తో మాట్లాడుతుండగా శిరీష ఆత్మహత్య చేసుకున్నదని శ్రవణ్ పోలీసులతో తెలిపినట్లుగా సమాచారం. శిరీష మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు శిరీష మృతి చెందిన గదిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
తనకు, శిరీషకు, తన ప్రేయసికి సమస్యలని రాజీవ్
తనకు, శిరీషకు, తన ప్రేయసికి మధ్య సమస్యలు ఉన్నాయని, ఆ డిప్రెషన్తోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని రాజీవ్ అంతకుముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే, శిరీష చెంపపై దెబ్బల గుర్తులు ఉండడం, ఆమె పెదవి, తల వెనక భాగంలో చిట్లినట్లు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
వేర్వేరుగా విచారించినా..
శ్రవణ్ను, రాజీవ్ను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించినా.. ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్లిన విషయాన్ని మాత్రం బయటపెట్టలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శిరీష మృతిపై శ్రవణ్, రాజీవ్లను విచారిస్తున్న విషయం మిత్రుల ద్వారా తెలుసుకున్న కుకునూరు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, అలాగే శ్రవణ్ను వేరుగా విచారిస్తున్నారని తెలుసుకొని, ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంటున్నారు. అప్పటికే ఆయన కుకునూర్పల్లి నుంచి బదలీకి ప్రయత్నిస్తున్నారు. శిరీష వ్యవహారం కూడా తోడవడంతో తనకు చెడ్డపెరు వస్తుందని ఆందోళన చెంది ఉంటాడని భావిస్తున్నారు.
కొబ్బరిబోండాం తెమ్మని చెప్పి..
శిరీష మృతి నేపథ్యంలో మంగళవారం నుంచి ఆందోళనతో ఉన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో కొడకండ్ల వైపు నుంచి స్టేషన్కు వచ్చారు. తనకు నీరసంగా ఉన్నదని, కొబ్బరిబొండాం తీసుకురమ్మని ఓ కానిస్టేబుల్ను పంపారు. కానిస్టేబుల్ బయటకు వెళ్లగానే క్వార్టర్కు వెళ్లిన ఎస్సై తన గదిలోని ఒక కుర్చీలో కూర్చొని సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నట్లు భావిస్తున్నారు. కొబ్బరి బొండాం తెచ్చిన కానిస్టేబుల్ ఎస్సైని ఎంతసేపు పిలిచినా స్పందించకపోవడంతో గది అద్దాలు పగలగొట్టి చూడగా కుర్చీలో రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్సైని చూసి అధికారులకు సమాచారం అందించారు.