చిన్న మోడీ! సైబరాబాద్ సృష్టికర్తని నేనే, అప్పుడు నా పక్కనే ఉన్నావ్: కేసీఆర్పై చంద్రబాబు
హైదరాబాద్: భాగ్యనగరాన్ని కట్టింది తానేనని నేను చెప్పినట్లుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ అలా చెప్పలేదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపానని చెప్పారు. హైదరాబాదుకు టీడీపీ హయాంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని చెప్పారు. బీజేపీ, తెరాస రెండూ నాటకాలు ఆడుతున్నాయన్నారు.
కేసీఆర్ తనను ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పాలని అడిగారు. హైటెక్ సిటీ నిర్మించినందుకా, సైబరాబాద్ కట్టినందుకా అన్నారు. హైదరాబాద్ను తాను కట్టానని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. దానిని కులీకుతుబ్ షా కట్టించారన్నారు. సైబరాబాద్లాంటి ఆర్థిక నగరాన్ని నిర్మించానన్నారు. 20 ఏళ్లలో నగరం ఎంతో పెరిగిందని, ఇంత అభివృద్ధికి టీడీపీ విజన్ కారణమని చెప్పారు.
సైబరాబాద్ను నిర్మించి, పేరు పెట్టింది నేనే
సైబరాబాద్ను నిర్మించి, పేరు పెట్టింది తానేనని చంద్రబాబు చెప్పారు. సైబరాబాద్ను నిర్మించినట్లే అమరావతిని నిర్మిస్తానని చెప్పారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే అన్నారు. బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడింది నేనే అన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆనాడు బాబ్లీపై పోరాడానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేస్తే నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.
కేసీఆర్ చిన్నమోడీ
కొందరు నేతలు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి, ఆ తర్వాత పార్టీకి నామాలు పెట్టి పోయారని, వారిని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ చిన్నమోడిలా తయారయ్యారని చెప్పారు. కేసీఆర్కు మెచ్యూరిటీ ఉంటుందని మోడీ అంటారని, ఇలాంటి వ్యాఖ్యలు లాలూచీకి నిదర్శనం కాదా అన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఏనాడు అడ్డుపడలేదని చెప్పారు.
సైబరాబాద్ను నిర్మించినప్పుడు కేసీఆర్ నాతోనే ఉన్నారు
గచ్చిబౌలి స్టేడియం, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డు... ఇలా ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ ఎవరు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. సైబరాబాద్ తన మానసిక పుత్రిక అన్నారు. దీనిని ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా తనతోనే ఉన్నారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తున్న టీడీపీ తెలంగాణలో ఎందుకు అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ లేడన్నారు. టీడీపీలో పుట్టి, పైకొచ్చి చివరకు ఆ పార్టీ పైనే విమర్శలు చేయడం సరికాదన్నారు.
మోడీ చాలా తెలివైనవారు
తన కంటే కేసీఆర్కు పరిపక్వత ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని, జగడాలు పెట్టడంలో ఆయన చాలా తెలివైనవారని చంద్రబాబు అన్నారు. తాను నలభై ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉంటే చరిత్ర తనను క్షమించదని చెప్పారు. అందుకే అన్నిపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. కేంద్రం అన్యాయం చేస్తే ఎదిరించిన పార్టీ టీడీపీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎవరు ఫోన్లలో మాట్లాడాలన్నా భయపడుతున్నారని, మీడియా పేపర్లో రాయాలన్నా కేంద్రంలో పెద్ద మోడీ, తెలంగాణలో చిన్న మోడీని చూసి భయపడుతున్నారన్నారు.
నా చేతిలో రిమోట్ ఉంటుందా?
తెలంగాణలో తాను నీటికి అడ్డంపడలేదని, తన హయాంలో మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్, దేవాదుల, కల్వకుర్తి, భీమ ఎత్తిపోతల వంటి వాటిని ప్రారంభించానని చంద్రబాబు చెప్పారు. ఒక ఆర్థిక నగరాన్ని నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన తనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. సైబరాబాదు పరిధిలో ఉన్న బిల్డింగులు కేసీఆర్ కట్టారా అని ప్రశ్నించారు. విభజనతో నష్టపోయిన ఏపీలో రైతులకు రూ.1.5లక్షల రుణమాఫీ చేస్తే కేసీఆర్ చేసింది కేవలం రూ.లక్ష అన్నారు. 13 మంది పోటీ చేసిన టీడీపీ చేతిలో తెలంగాణ రిమోట్ కంట్రోల్ ఉంటుందా అన్నారు. ఎప్పుడూ కేసీఆర్కు పదవుల ధ్యాస తప్ప ఇంకేమీ లేదన్నారు.