యుద్ధభూమిలో ఉన్నాం, ఢిల్లీని ఢీకొంటాం: లగడపాటి
హైదరాబాద్: రాజకీయావసరాల కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తోందని, ఢిల్లీని ఢీకొంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ నెల 21న సమైక్య విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడం తథ్యమన్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాజీనామా కథనాల నేపథ్యంలో ఆయన్ను రాజీనామా చేయవద్దని కోరామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం తాము యుద్ధ భూమిలో ఉన్నామని, ఇలాంటి తరుణంలో ఆయుధాల్లాంటి పదవులను వదిలేయడం సరికాదని లగడపాటి అన్నారు. ముఖ్యమంత్రే కాదు కేంద్ర మంత్రులూ పదవులకు రాజీనామా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య సింహంలా వ్యవహరిస్తూ తమకు సైన్యాధ్యక్షుడిలా ఉన్నారనే ధైర్యంతోనే పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం ఇంత కాలం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని చెప్పారు.
ఇలాంటి తరుణంలో సీఎం రాజీనామా చేస్తే యుద్ధం మధ్యలోనే ఆయుధాలు వదిలేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో తమ బలం ఇంకా ఉందని, సోమవారం పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. ఈ నెల 17,18 తేదీల్లో ఢిల్లీలో జరిగే భారీ ధర్నాకు రావల్సిందిగా ముఖ్యమంత్రిని కోరామని, దీనిపై ఆలోచించుకుని చెబుతానని కిరణ్ అన్నారని ఆయన చెప్పారు.
ఢిల్లీకి ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా వస్తే బాగుంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఘటనపై ఇతర పార్లమెంటు సభ్యులు తనపై ఆగ్రహం వ్యక్తం చేసినా తాను ప్రాణాలకు సైతం తెగించటానికి గల కారణాలను వారికి వివరించానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ని 6నెలల కిందటే మార్చేయాలని సోనియా భావించారని, ఇందుకోసం రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకున్న పార్టీలతో కుట్ర పన్నారని తెలిపారు. సీఎం నుంచి రాజీనామా లేఖను కూడా తీసుకున్నారని, అయితే అప్పుడు తామంతా సీఎంను కాపాడుకున్నామని లగడపాటి వివరించారు.
ఇప్పుడు సీఎం కిరణ్ని తామే కాకుండా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కాపాడుకుంటారన్నారు. రాష్ట్రాన్ని రాజకీయం లబ్ధి కోసం విభజించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కుట్ర పన్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. రాష్ట్రాన్ని కేక్లా కట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ అంటే 10 జనపథ్ కాదన్నారు. సభ నుంచి సీమాంధ్ర ఎంపీలను బయటికి పంపి ఇక తెలంగాణ బిల్లుపై ఏం చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసిందన్నారు.