కెసిఆర్కు భయపడి కాదు: బెజవాడపై రావెల వ్యాఖ్య
కడప: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. ఎవరికీ భయపడే ప్రశ్న లేదని, పాలనా సౌలభ్యం కోసమే తాత్కాలిక రాజధాని అని చెప్పారు.
హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజానీకాన్ని రెండో పౌరులుగా గుర్తించి, వారిపై స్థానికేతరులుగా ముద్ర వేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వే పేరుతో కుట్ర పన్నుతున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
సంక్షేమ పథకాల కోసం సర్వే చేస్తున్నామని చెబుతూనే 1956ను స్థానికతగా తెరపైకి తెచ్చి హైదరాబాద్లో జీవిస్తున్న ఆంధ్రులను రెండో పౌరులుగా గుర్తించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సర్వే ప్రొఫార్మాలో అభ్యంతరకరంగా, మీ హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ఆప్షన్లను పూరించవద్దని సూచించారు. హైకోర్టు మనకు రక్షణ కల్పించిందని, సర్వే తప్పనిసరి కాదని అన్నారు. ఎవరైనా మీదే రాష్ట్రం అంటే ఇదే మా రాష్ట్రం అని చెప్పాలన్నారు.
తెలంగాణ కోసం గజ్జెకట్టిన గద్దర్ కూడా 1956 తరువాతే వచ్చారని అన్నారు. 1956ను స్థానికతగా తీసుకుంటే తెలంగాణలో ఉన్నవారంతా స్థానికేతరులుగా మారుతారన్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి టిడిపి రక్షణగా ఉంటుందని, ఆస్తులను కాపాడుతామని మంత్రి చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఎంసెట్ కౌన్సెలింగ్, గవర్నర్ అధికారాలు- ఇలా ప్రతి దాన్ని కెసిఆర్ ప్రభుత్వం రాద్ధాంతంచేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను కెసిఆర్ గౌరవించడం లేదన్నారు.