ఓ మహా యజ్ఞంలా చేశాం: సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సభలో చంద్రబాబు
విశాఖపట్నం వేదికగా రెండు రోజులపాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సును ఓ యజ్ఞంలా నిర్వహించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా రెండు రోజులపాటు నిర్వహించిన సీఐఐ
భాగస్వామ్య సదస్సును ఓ యజ్ఞంలా నిర్వహించినట్లు ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ సదస్సుకు అడ్డంకులు సృష్టించాలనుకున్న వారి ఆటలు సాగలేదన్నారు.
సదస్సు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడుతూ సదస్సులో కుదిరిన ఎంఓయూలకు సంబంధించిన వివరాలను
వెల్లడించారు.
భాగస్వామ్య సదస్సులో గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదని
వ్యాఖ్యానించారు. రెండు రోజుల సదస్సులో మొత్తం రూ.10.54 లక్షల కోట్ల
పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
ఇది భవిష్యత్ అభివృద్ధికి నాందిగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రభుత్వంతో
కుదుర్చుకున్న ఎంఓయూలు అమలులోకి వస్తే 22.5 లక్షల మందికి ఉపాధి
లభిస్తుందని వివరించారు.రాష్ర్ట ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ర్ట ప్రతిష్ఠను పెంచేందుకు తాను కష్టపడి
పనిచేస్తున్నానని, ఇరవై నాలుగు గంటలూ ప్రజా శ్రేయస్సు కోసమే ఆలోచిస్తున్నానని
చెప్పారు. రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలని, పేదరికం పోవాలని, యువత
గర్వంగా తలెత్తుకునేలా చేయాలన్నదే తన ధ్యేయమని చంద్రబాబు అన్నారు.
హోదాతో వచ్చేవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని చెప్పినందుకే ఒప్పుకున్నామని,
అసలు ప్రత్యేక హోదా కోరడం వల్ల ప్రయోజనం లేదని, త్వరలోనే దానిని
తొలగించనున్నారని పేర్కొన్నారు.
రాష్ర్టంపై బురదజల్లే పనులు, రాష్ర్ట ప్రతిష్ఠను దెబ్బతీసే పనుల వల్ల ప్రజల
ప్రయోజనాలు దెబ్బతింటాయని, అందువల్ల అలా ఎవరూ చేయకూడదని హితవు
పలికారు. ప్రత్యేక హోదాకు, జల్లికట్టుకు ముడిపెట్టరాదన్నారు.
స్వార్థపూరిత నాయకుల మాయలో పడవద్దని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
విశాఖ ప్రజలు ఎంతో స్ఫూర్తి ప్రదాతలని, గత ఏడాది హుద్ హుద్ తుపాను వచ్చిన
సమయంలో దీపావళి పండగకు టపాసులు కాల్చరాదంటూ ఇచ్చిన పిలుపును విశాఖ
ప్రజలు ఎంతో క్రమశిక్షణతో పాటించారని ఆయన కొనియాడారు.
కుదిరిన అవగాహన ఒప్పందాలు ఇవే...
- పరిశ్రమల రంగంలో రూ. 2.1 లక్షల కోట్ల పెట్టుబడులతో 91 అవగాహన ఒప్పందాలు
కుదిరాయి. దీంతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
- ఇంధన రంగంలో రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులతో 47 అవగాహన ఒప్పందాలు
కుదరగా, 86 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
- ఏపీసీఆర్డీఏతో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులతో 62 ఎంఓయూలు. 2 లక్షల
మందికి ఉపాధి అవకాశాలు.
- మైనింగ్ రంగంలో రూ. 11,113 కోట్ల పెట్టుబడులతో 50 అవగాహన ఒప్పందాలు. 17
వేల మందికి ఉపాధి అవకాశాలు.
- ఆహార శుద్ధి రంగంలో రూ.6,055 కోట్ల పెట్టుబడులతో 177 ఎంఓయూలు. తద్వారా 60
వేల మందికి ఉపాధి అవకాశాలు.
- పర్యాటక రంగంలో రూ.7237 కోట్ల పెట్టుబడులతో 69 ఎంఓయూలు. తద్వారా 50
వేల మందికి ఉపాధి అవకాశాలు.
- ఐటి రంగంలో రూ.4,813 కోట్ల పెట్టుబడులతో 67 ఎంఓయూలు. తద్వారా 47 వేల
మందికి ఉపాధి అవకాశాలు.
- రోడ్లు భవనా శాఖలో రూ.74 వేల కోట్ల పెట్టుబడులతో అవగాహన ఒప్పందాలు.
- టౌన్ షిప్ వసతుల కల్పనకు రూ.40 వేల కోట్ల పెట్టబడులతో 14 అవగాహన
ఒప్పందాలు, తద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు.
- ఏపీఈడీసీ ద్వారా రూ.3,62,662 కోట్ల పెట్టబడులతో 66 అవగాహన ఒప్పందాలు.
- నైపుణ్యాభివృద్ధిలో రూ.3 వేల కోట్ల పెట్టబడులతో 3 ఎంఓయూలు.
- జౌళి రంగంలో రూ.521 కోట్ల పెట్టబడులతో 8 ఎంఓయూలు. 18,550 మందికి ఉపాధి
అవకాశాలు.
- ఉన్నత విద్యారంగంలో రూ.16,706 కోట్ల పెట్టబడులతో 9 ఎంఓయూలు. 1.52 లక్షల
మందికి ఉపాధి అవకాశాలు.