బాబు సర్కార్ అలా చేస్తే ఉద్యమం తప్పదు, కావాలనే ఇంత కక్ష: రోజా
'విద్యుత్ బిల్లులు చెల్లించని దళిత, గిరిజనులపై కేసులు నమోదు చేస్తే ఉద్యమించక తప్పదు' అని రోజా హెచ్చరికలు చేశారు.
పుత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గాన్ని తొలి నుంచి సీఎం చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. నగరి నియోజకవర్గం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బుధవారం నాడు పుత్తూరు ఆర్&బీ గెస్ట్ హౌజ్ లో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా దళిత, గిరిజన కుటుంబాలను విద్యుత్ బిల్లుల పేరుతో చంద్రబాబు సర్కార్ వేధిస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాం నుంచి దళిత, గిరిజన కుటుంబాలకు 50యూనిట్ల నుంచి 70యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని 70యూనిట్లకు పెంచామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తుంది తప్పితే.. ఆచరణలో మాత్రం బిల్లుల కోసం వారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విద్యుత్ బిల్లులు చెల్లించని దళిత, గిరిజనులపై కేసులు నమోదు చేస్తే ఉద్యమించక తప్పదు' అని రోజా హెచ్చరికలు చేశారు.
ఓవైపు జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఉంటే, ఆర్ డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ అధికారులను చంద్రబాబు డిప్యుటేషన్ పంపించడం సరికాదన్నారు నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యల రీత్యా డిప్యుటేషన్ పై పంపించిన అధికారులు తిరిగి వెనక్కి పంపించేలా చర్యలు కలెక్టర్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ.. ఎంపీడీవోలు, జేబీ కమిటీలతో కుమ్మక్కై అనర్హులకు సామాజిక భద్రతా పెన్షన్లు కట్టబెడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. సమావేశంలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.