దోపిడీలో అనుభవం లేదు: యనమల, ఓటుకు నోటు, మోడీ దయ: బాబుకు జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు.
జగన్ మాట్లాడుతూ.. మేం ఈ తరం వాళ్లమని, చంద్రబాబు పాత తరం వాళ్లని, తాము అన్ని ఆధారాలు చూపించగలమన్నారు. దీనిపై యనమల మాట్లాడారు.
ప్రజలకు ఏం చేయాలో, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి తీసుకు రావాలనే ఆలోచన చంద్రబాబు చేస్తారని, జగన్లా మనీలాండరింగ్, సూటుకేసు కంపెనీలు ఎలా పెట్టుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని ఆలోచించరని, జగన్ మాత్రం వాటి పైన బాగా హోంవర్క్ చేస్తారని, మాకు అందులో అనుభవం లేదని, మీరు, మీ నాన్నగారు (వైయస్) పని చేసింది బ్రీఫ్ కేసు కంపెనీల కోసమని యనమల ఎద్దేవా చేశారు.
మేం (టిడిపి) ప్రజల కోసం పని చేస్తామన్నారు. మీరు బ్రీఫ్ కేసు కంపెనీల కోసం పని చేశారు కాబట్టే ప్రతి శుక్రవారం దర్శనం చేసుకోవాల్సి వస్తుందని కోర్టుకు వెళ్లడాన్ని ఉద్దేశించి అన్నారు. మాతో మీరు పోల్చుకోవద్దని, మీతో మేం పోల్చుకోవద్దన్నారు.
జగన్ కౌంటర్
అవును.. చంద్రబాబు ఇటీవల ఓటుకు కోట్ల మీద ఎక్కువగా అధ్యయనం చేస్తున్నారని జగన్ కౌంటర్ ఇచ్చారు.
సీడీలు చూస్తే జగన్ నైజం బయటపడుతుంది: మోదుగుల
అసెంబ్లీలో జగన్ తీరుకు సంబంధించి సీడీలు ఉన్నాయని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆ సీడీలు చూస్తే జగన్ నైజం తెలుస్తుందన్నారు. వైసిపి కనీసం పోరాడకపోయినా.. పోరాడే వారికి మద్దతు ఇస్తే మంచిదని హితవు పలికారు.
ప్రత్యేక హోదాపై జగన్.. చంద్రబాబు కౌంటర్
జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. హోదాతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చెప్పారు. నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా వల్ల గ్రాంట్ ఎక్కువగా వస్తే అప్పులు తగ్గుతాయని చెప్పారు. దేశంలో 12 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందన్నారు.
11 షెడ్యూల్లో చెప్పిన ప్రాజెక్టులకు రూ.8వేల కోట్లు కావాలన్నారు. జమ్ము కాశ్మీర్కు కూడా హోదా ఉన్నప్పటికీ ప్యాకేజీ ప్రకటించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దయతలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీ అయినా వస్తుందో మనం ఊహించుకోవచ్చన్నారు.
హోదా వల్ల గ్రాంట్ ఎక్కువగా వస్తే అప్పులు తగ్గుతాయన్నారు. పన్ను రాయితీలు కూడా వస్తాయన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రాయితీలు రావని, హోదాతోనే వస్తాయన్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు హోదాతో వస్తాయన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ...
ప్రత్యేక హోదా అవసరమే కానీ, చెప్పగానే వస్తుందనేది సరికాదని చంద్రబాబు అన్నారు. హోదాతో ప్రాజెక్టులు పూర్తి కావని చెప్పారు. జగన్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ఏఐబిపి కింద వెయ్యి కోట్ల నిధులే ఇచ్చిందని, ప్రత్యేక హోదాతో ప్రాజెక్టులకు నిధులు రావన్నారు.
జగన్ చెప్పినట్లు హోదాతో ప్రాజెక్టులకు నిధులు రావన్నారు. ఏఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ప్రత్యేక హోదా కింద వచ్చాయో జగన్ తెలుసుకోవాలన్నారు. 2010 నుంచి ప్రత్యేక హోదా కింద వచ్చే నిధులు తగ్గించాలన్నారు. గతంలో 56 శాతం ఇస్తే, ఇప్పుడు 11 శాతం ఇస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీ తండ్రి (వైయస్) నీళ్ల గురించి అడిగారని, కానీ ఆయన సిఎం అయ్యాక కూడా అస్యూర్డ్ వాటర్ ఇచ్చుకోలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడుదామన్నారు. మీ నాన్నలాగే నీవు ప్రజలను మభ్యపెట్టవద్దన్నారు.
జగన్ మాట్లాడుతూ...
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏఐబిపి నిధులు వస్తాయని చెప్పారు. చంద్రబాబు దేనిని అయినా తనకు అనుకూలంగా మల్చుకోవడంలో దిట్ట అన్నారు. హోదా రాష్ట్రాలకు ఎన్ని నిధులు వస్తాయన్న దానికి నిబంధన లేదన్నారు.
కేంద్రం ఇష్ట ప్రకారం ఇస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం తీర్మానం చేసి 18 నెలలు అవుతోందన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకటించిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. ప్రధాని నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక హోదా వెంటనే వస్తుందన్నారు.
మనకు ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడు ఏ రాష్ట్రాలు అడ్డు చెప్పలేదన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని చెబుతున్నారన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు తీసేయలేదని కేంద్రం చెప్పిందని జగన్ అన్నారు.