మీ అందరినీ శ్రీరాముడు అనుగ్రహించుగాక- వెనక్కి తగ్గిన ఆదిపురుష్ యూనిట్
అమరావతి: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
ఆదిపురుష్ సినిమాపై క్రిటిక్స్ చేస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రామాయణాన్ని సమూలంగా మార్చేసేలా ఈ కథను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు. రామాయణాన్ని చివరికి ఓ కల్పిత గాథగా భావించేలా దర్శకుడు ఓం రౌత్ సినిమాను తీశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం తెలిసిందే. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుడు చెప్పే డైలాగ్.. విమర్శల సునామీని ఎదుర్కొంది. రామయణ స్ఫూర్తిని దెబ్బతీసిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనితో ఆదిపురుష్ యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ డైలాగులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముస్తాషిర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీనిపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవలసిన మొదటి పాఠమని, అలా జరగలేదని భావిస్తున్నట్లు చెప్పారు.

తరాలు మారినా.. అనుభూతిలో ఎలాంటి మార్పులు ఉండబోవని వ్యాఖ్యానించారు. ఆదిపురుష్లో తాను 4,000 లైన్లకు పైగా డైలాగ్స్ రాశానని, అందులోని అయిదు లైన్లు.. ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లుగా తెలిసిందని అన్నారు. ఆ వందలాది పంక్తుల్లో శ్రీరాముడిని కీర్తించినప్పటికీ.. సీతమ్మ తల్లి పవిత్రతను వర్ణించినప్పటికీ.. దానికి అనుగుణంగా ప్రశంసలు అందలేదని చెప్పుకొచ్చారు.
తన సొంత సోదరులే సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేశారని మనోజ్ వాపోయారు. తాను గతంలో టీవీలో చాలాసార్లు కవితలు చదివానని గుర్తు చేశారు. ప్రతి తల్లితోనూ తన తల్లిగా చూసే శ్రీరాముడిని కూడా మరిచిపోయేంతటి ఆగ్రహం తనపై వ్యక్తమౌతోందని చెప్పారు. తనను సనాతన ద్రోహిగా ఆరోపిస్తోన్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…
ఇదే సినిమాలో జై శ్రీరాం, శివోహం, రామ్ సియారామ్ పాటలు వినలేదా? అని ప్రశ్నించారు. అవి కూడా తన కలం నుండి జాలువారినవేనని గుర్తు చేశారు. తేరి మిట్టి, దేశ్ మేరే అనే పాటలు కూడా తానే రాశానని, అలాంటి ఒకట్రెండు డైలాగులను ఆధారంగా చేసుకుని తనపై సనాతన ద్రోహి అనే ముద్రను వేసే ప్రయత్నం చేస్తోన్నారని మనోజ్ చెప్పారు. ఒకరికొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం ద్వారా సనాతన ధర్మమే నష్టపోతుందని చెప్పారు.
లక్షలాది మంది అభిమానుల భావోద్వేగాల కంటే తనకు గొప్పది ఏదీ లేదని మనోజ్ చెప్పుకొచ్చారు. వివాదాస్పద డైలాగులు సదరు సన్నివేశానికి అనుకూలంగా ఉన్నవేనంటూ లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలనని, అది అభిమానుల ఆగ్రహాన్ని ఆవేదనను తగ్గించదని అన్నారు. అందుకే వారిని బాధించిన కొన్ని డైలాగులను సవరించదలచామని, ఈ వారం అవి సినిమాలో యాడ్ అవుతాయని అన్నారు. మీ అందరినీ శ్రీరాముడు అనుగ్రహించుగాక అంటూ శుభం పలికారు.












Click it and Unblock the Notifications