సెంటిమెంటుతోనే: టిఆర్ఎస్పై కిషన్, సహకరిస్తామని..
హైదరాబాద్: అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించిన దేశ ప్రజలు.. సమర్థుడైన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎంచుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రజలు మోడీని, బిజెపిని గెలిపించుకుంటున్నారని అన్నారు. 25ఏళ్ల తర్వాత ఒక జాతీయ(బిజెపి) పార్టీ పూర్తి స్థాయి మెజార్టీని సాధించిందని తెలిపారు.
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే ఎన్నికలుగా భావించిన ప్రజలు బిజెపికి పట్టం కడుతున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలని ప్రజలు ఆకాంక్షించారని.. అందుకే బిజెపిని గెలిపిస్తున్నారని చెప్పారు. అయితే తెలంగాణలో తాము అనుకున్నంత ఫలితాలు సాధించలేదని చెప్పారు. ఇందుకు తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని చెప్పారు. పరోక్షంగా ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతోనే ఈ నష్టం జరిగిందని తెలిపారు.

తాము ఈ ఫలితాలపై సమీక్షించుకుని, ఏ విధంగా ముందెళ్లలనేదానిపై చర్చిస్తామని అన్నారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో మెజార్టీ స్థానాలు దక్కించుకుందని తెలిపారు. అయితే బిజెపికి ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వానికి తాము అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని అన్నారు.
నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు మోడీకి అనుకూలంగా ఉన్నప్పటికీ సెంటిమెంటు, తాము తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా టిఆర్ఎస్ పార్టీ లాభపడిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించిన నాయకులు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సెంటిమెంటు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ ఉందని
అన్నారు. అందుకే తాను మూడోసారి అంబర్ పేట నియోజకవర్గం నుంచి 61వేల ఓట్ల మెజార్టీతో గెలిచినా.. రెండో స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి నిలిచారని చెప్పారు.












Click it and Unblock the Notifications