జగన్ కు షాక్: వైసీపీ లేకుండానే మూడో ఫ్రంట్, పవన్ కళ్యాణే కీలకం
2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీని గద్దెదించేందుకు మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేస్తున్నాయి.
రాజమండ్రి: 2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీని గద్దెదించేందుకు మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేస్తున్నాయి.ఈ మేరకు కలిసివచ్చేపార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు వామపక్షాలు సన్నద్దమౌతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలుపుకొని మూడో కూటమిని ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ సోమవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్షం మూడో కూటమిలో ఉండదని ఆయన ప్రకటించారు.
2019 ఎన్నికల్లో టిడిపిని గద్దె దించేందుకు విపక్షాలు రంగం సిద్దం చేస్తున్నాయి.అయితే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈ కూటమిలో ఉండకపోవచ్చు.ఇ ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఇతర పార్టీలన్నీ కూటమిగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ కు వైసీపీ మద్దతును ప్రకటిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీని కూటమిలో చేర్చుకొనే విషయమై ఆ పార్టీలు ఆలోచిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పనిచేసే విషయమై జనసేన పార్టీ చీప్ పవన్ కళ్యాణ్ తో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చర్చించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సానుకూలంగానే స్పందించారు. మూడో కూటమి ఏర్పాటుచేసి ఎన్నికల్లో పోటీచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో టిడిపి పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. మరో వైపు వైసీపీ కూడ ఇతర పార్టీలతో కలిస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆ పార్టీకి కొత్తగా ఎన్నికల వ్యూహకర్తగా నియమించిన ప్రశాంత్ కిషోర్ జగన్ కు సూచించినట్టు సమాచారం.
మూడవ ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్దం
2019 ఎన్నికల కోసం వామపక్షాలు, జనసేనలు రంగం సిద్దం చేస్తున్నాయి.అయితే ఈ కూటమితో కలిసి వచ్చే పార్టీలను కూడ కలుపుకుపోనున్నట్టు సిపిఐ రాష్ట్రసమితి కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఆయన సోమవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలోని మూడు పార్టీలు మోడీకి దాసోహమంటున్నాయని రామకృష్ణ విమర్శించారు. ఎన్ డి ఏ కు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో జనసేనతో కలిసి ఇతర పార్టీలను తమ కూటమిలో కలుపుకొనిపోతామన్నారు రామకృష్ణ.
పవన్ తో చర్చించిన రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోటీచేసే విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే చర్చించారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వామపక్షాలకు ఒక్కసీటు కూడ దక్కలేదు. బిజెపి, టిడిపి లకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించే పార్టీలతో కూటమిని అనుసరించాలని వామపక్షాలు నిర్ణయించాయి.అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకొంటారా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అయితే వైసీపీని దూరం పెట్టనున్నారు. ఎన్ డి ఏకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందున వైసీపినీ మూడో ఫ్రంట్ కు దూరం పెడుతున్నారు.
పవన్ కలిస్తే మూడో ప్రంట్ కు కలిసివచ్చేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించనున్నారు. అయితే మూడో ఫ్రంట్ తో పవన్ కళ్యాణ్ కలిస్తే మూడో ఫ్రంట్ కు కలిసివచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వామపక్షాలకు గంపగుత్తగా ఉన్న ఓట్లు కూటమికి పడే అవకాశాలున్నాయి.అయితే ఈ కూటమి తరపున పోటీచేసే అభ్యర్థి గెలుపు అంచుల వరకు వెళ్ళాలంటే ఇతర అంశాలు కూడ కలిసిరావాల్సి ఉంటుంది. పోల్ మేనేజ్ మెంట్ సక్రమంగా తెలిసిన నాయకులు ఈ కూటమి తరపున బరిలో దిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యమంత్రి ఎవరు కావాలనే అంశం కూడ రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవాలు తెలియాలి
ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని టిడిపి ప్రకటించిన విషయాన్ని రామకృష్ణ గుర్తుచేశారు. కరువుకాటకాలు వచ్చిన సమయాల్లో, తుపాన్ తో నష్టపోయిన రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్లు ఇచ్చామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారని, బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహరాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ మాత్రం రూ.1.72 లక్షల కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా రూ. 2.25 లక్షల కోట్లు ఇచ్చినట్టుప్రకటించారన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబును డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా రోజు ఉపన్యాసాలు చెప్పే చంద్రబాబునాయుడు దీపక్ రెడ్డిని ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా నుండి ఉపాధ్యాయుల బదిలీల వరకు రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.