అన్యాయం చేసిన అధికారులు, నేతలను బట్టలూడదీసి నిలబెడతాం ... జగన్ మాస్ వార్నింగ్
అన్యాయం చేసిన అధికారులు, నేతలను బట్టలూడదీసి నిలబెడతామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ సబ్ జైలుకు వెళ్లి ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ కూడా లోపలికి వెళ్లారు. ములాఖత్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అధికారులకు హెచ్చరిక..
అధికారులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగం కావొద్దని జగన్ పిలుపునిచ్చారు. అన్యాయం చేసిన అధికారులు, నేతలను బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రిటైర్ అయినా.. సప్తసముద్రాల అవదల ఉన్నా వదిలిపెట్టమన్నారు. అన్యాయం చేసేవారిని చట్టం ముందు నిలబెడతామని.. న్యాయం జరిగేలా చేస్తామన్నారు. పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండని చెప్పారు.

వంశీ అరెస్ట్ రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు అద్దం పడుతోందని జగన్ విమర్శలు గుప్పించారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదని.. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారన్నారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందన్నారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని.. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారని జగన్ వ్యాఖ్యానించారు.
పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారన్నారు జగన్. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారని.. అసలు పోలీసులు పెట్టిన కేసు ఏంటని ప్రశ్నించారు. సత్యవర్ధన్ను మంగళగిరికి పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారని.. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టే ప్రయత్నం చేశారని.. ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదని.. ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కూడా కాదని జగన్ అన్నారు. వంశీకి బెయిల్ రాకూడదనే చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారన్నారు.












Click it and Unblock the Notifications