మార్కెటింగ్ మాదే: బాబు, చెవిరెడ్డికి తప్పిన ప్రమాదం
గుంటూరు/చిత్తూరు: మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యతను తామే చూసుకుంటామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. గుంటూరు జిల్లా శావల్యాపురంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు ఆధాయం పెరిగే మార్గాలు ఆలోచించాలన్నారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలన్నారు.
పట్టుదలకు మారుపేరు డ్వాక్రా సంఘాల సభ్యులని, వారికి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు కట్టిన వడ్డీని పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు.
మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యత కూడా తమదే అన్నారు. పించన్ల పైన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదలకు రూ.8వేల కోట్లు ఇచ్చిన ఘనత తమదే అన్నారు. మనలను చూసి పేదరికం భయపడాలని వ్యాఖ్యానించారు.
చెవిరెడ్డికి తప్పిన ముప్పు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం చిత్తూరు జిల్లా పాకాల మండలం ఎల్లంపల్లి వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపై జంతువును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. చెవిరెడ్డికి ఎలాంటి గాయం కాలేదు.