కేంద్రం సహకారం తీసుకుంటాం: కేసీఆర్, 15 ఏళ్లు బీజేపీయే: దత్తాత్రేయ
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం చెప్పారు. పాతబస్తీలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తామన్నారు.
లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి మూడు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. నగరానికి నాలుగు వైపుల యాభై కిలోమీటర్ల అవతల డంప్ యార్డులు ఉంటాయని చెప్పారు.
మరే పదిహేనేళ్లు అధికారంలో బీజేపీయే: దత్తాత్రేయ
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కేంద్రంలో మరో పదిహేనేళ్ల వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారే కొనసాగుతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వేరుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిని కోలుకోలేని స్థితిలో ఉందన్నారు.
ఏ ట్రాక్ రికార్డు చెప్పి వారు ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. ఏడాది పాలనలో అవినీతిని పారద్రోలిన ప్రభుత్వంగా దేశంలో నమ్మకం వచ్చిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాల అభివృద్ధి అని నమ్మి టీమిండియాలో దేశ అభివృద్ధికి మోడీ కంకణం కట్టుకున్నారన్నారు.
వచ్చే రెండేళ్లలో ఇచ్చిన హామీ మేరకు కోటి మందికి ఉపాది కల్పించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వైఫై సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార సేవలు చాలా అవసరమని, దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలకు కేంద్రం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. త్వరలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధితో పాటు అన్ని వర్సిటీల్లో వైఫై సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు.
రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు: పోచారం
మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకొస్తామన్నారు. రూ.15వేల కోట్లతో కరెంట్ కొనుగోలు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత తెరాసదే అన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సీడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు.