పది నెలల్లో హైదరాబాద్ ఖాళీ చేస్తాం: కిశోర్, విశాఖే
న్యూఢిల్లీ: సీమాంధ్ర రాజధాని కోసం పదేళ్లు అవసరం లేదని పదినెలలు సరిపోతుందని ఆ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేశ్ అన్నారు. ఆయన బుధవారం ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత పదినెలల్లోనే హైదరాబాద్ను ఖాళీ చేస్తామని చెప్పారు.
సీమాంధ్ర రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించాలని కిశోర్ చంద్రదేశ్ కోరారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానని తెలిపారు. విశాఖపట్నం దూరమవుతుందని పలువురు నాయకులు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కదా అని ప్రశ్నించగా.. విశాఖపట్నం ప్రజలకు రాయలసీమ కూడా దూరమే అవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చని కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. సీమాంధ్ర రాజధాని అతివేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ను పది నెలల్లో ఖాళీ చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేసుకుని, హైదరాబాద్ను ఖాళీ చేయాలని కిశోర్ చంద్రదేవ్ అన్నారు.