షర్మిలతో వచ్చిన భారతి ధీమా, పవన్పై తమ్మారెడ్డి ఫైర్
ఓటేసిన నాదెండ్ల
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
పవన్ విద్వేషాలు రెచ్చగొడ్తావా?: తమ్మారెడ్డి
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి, ఎన్నికల సమయంలో హడావుడి చేస్తూ.. తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ను లక్ష్యంగా పెట్టుకొని విమర్శలు చేసి రాజకీయాల్లో విద్వేషాలు ఉసిగొల్పారని ఆయన ఓ పత్రిక ఇంటర్వ్యూలో మంగళవారం అన్నారు.
పవన్ ఎన్నికల్లో కేవలం ఇద్దర్నే లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతున్నారన్నారు. విభజన గురించి కాకుండా ఇప్పుడు రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించాలన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి నీ వద్ద ఉన్న ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. పవన్ ఏం చెప్పి రాజకీయాల్లోకి వచ్చారో గుర్తుంచుకోవాలన్నారు. నీవు మద్దతిస్తున్న మోడీతో ప్రజల ఇబ్బందుల గురించి ఎప్పుడైనా చెప్పావా అన్నారు.
ఎన్టీఆర్ తెలుగోడి సత్తాను విశ్వవ్యాప్తం చేస్తే, ఇప్పుడు చంద్రబాబు మాత్రం మోడీ కాళ్ల వద్ద తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడు సింగపూర్లా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని, అక్కడ మంచినీళ్లు దొరక్క ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టిడిపి మద్దతు కోసం జాతీయస్థాయి నేతలు తహతహలాడేవారని, చంద్రబాబు మాత్రం దిగజార్చారన్నారు.