హైదరాబాద్ను వీడని వాన: ఆలస్యంగా నిమజ్జనాలు, మరో మూడ్రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: నగరంలో మూడో రోజు కూడా జోరు వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. గణేష్ నిమజ్జనం చేస్తున్న భక్తులు వర్షంతో కొంత ఇబ్బంది పడ్డారు. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహదీపట్నం, ప్రాంతాల్లో వర్షం పడింది.

హైదరాబాద్లో వరుసగా మూడోరోజూ వర్షం
మరోవైపు, కార్వాన్, లంగర్హౌస్, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్సాగర్, తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనం ఆలస్యమవుతోంది. రహదారుల పైకి వరద నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ శివారు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు జంట జలాశయాల రెండు గేట్లు ఎత్తి వరదను మూసీలోకి వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు.

ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు, రేపు భారీ వర్షాలు
ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలున్నాయని అప్రమత్తం చేసింది. కాగా, హైదరాబాద్ తోపాటు గురు, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications