ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: మరో రెండ్రోజులపాటు, ఈ జిల్లాలకు అలర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అయితే, మరో రెండు రోజులపాటు కూడా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు(గురు, శుక్రవారాల్లో) కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
కోస్తా తమిళనాడు, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం ఆయా ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, ఈశాన్య రుతుపవనాలు మరింతగా చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోట్లకు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలు కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఇది ఇలావుండగా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలతోపాటు యానాంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
🌧️☂️There's a chance of heavy rain over the South Eastern Coast. #tamilnadu #andhrapradesh #northeastmonsoon #weather #weatherupdate pic.twitter.com/pMlYwAF1mP
— Weather & Radar India (WeatherRadar_IN) November 3, 2022
ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మత్స్యకారులకు సూచన
విజయవాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు ఈ రెండ్రోజులపాటు సముద్రంపై వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు