ద్రవ్య బిల్లు ఎఫెక్ట్... నిపుణులు ఏమంటున్నారు.. 1న ఉద్యోగులకు జీతాలిస్తారా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర పడకుండానే సభ నిరవధిక వాయిదా పడటంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు ఖజానా నుంచి డబ్బులు పొందాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పనిసరి. అలాంటి బిల్లుకు మండలిలో ఆమోదం లభించకపోవడంతో.. సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభావం పడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఖజానా నుంచి నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారడంతో వైసీపీ ఇరకాటంలో పడిందని టీడీపీ చెబుతుండగా... అసలు మండలిలో బిల్లుకు ఆమోదం లభించకపోయినా పెద్దగా నష్టమేమీ లేదని వైసీపీ చెబుతోంది.
నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆక్రోశం
వైసీపీ నేతలు ఏమంటున్నారు...
ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా టీడీపీ చెబుతున్నట్టుగా ఏదో పెద్ద నష్టమేమీ జరగదని వైసీపీ నేతలు అంటున్నారు. మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటి,రెండు రోజులు ఆలస్యమవుతాయి తప్ప అంతకుమించి దాని ప్రభావం ఉండదన్నారు. నిబంధనల ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లుకు 14 రోజుల్లోగా మండలి నుంచి ఆమోదం వచ్చినా,రాకపోయినా.. ఆమోదం వచ్చినట్టగానే పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆపై దాన్ని గవర్నర్కు పంపుతారని.. గవర్నర్ ఆమోదం లభించగానే బిల్లు చట్టరూపం దాల్చుతుందని చెబుతున్నారు.
ఇదీ నిపుణుల మాట...
కేంద్రంలోనైనా,రాష్ట్రంలోనైనా.. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందడానికి దిగువ సభల ఆమోదమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దిగువ సభ(అసెంబ్లీ,లోక్సభ)లో ఆమోదం పొందిన ద్రవ్య బిల్లును ఎగువ సభ(రాజ్యసభ,శాసనమండలి)కు పంపించినప్పుడు... 14 రోజుల్లోగా ఏవైనా సవరణలు,ప్రతిపాదనలు సూచిస్తూ లేదా యథాతథంగా బిల్లును ఆమోదించాలి. ఎగువ సభ చేసిన సూచించిన సిఫారసులను దిగువ సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ బిల్లును ఎగువ సభ 14 రోజుల్లోగా దిగువ సభకు తిరిగి పంపించకపోతే... సాంకేతికంగా బిల్లు ఆమోదం పొందినట్టుగానే పరిగణిస్తారు.
ఒకటో తేదీన యథావిధిగా జీతాలు..
ఏపీలో ద్రవ్య వినిమియ బిల్లు ఈ నెల 17న అసెంబ్లీలో ఆమోదం పొందింది కాబట్టి... మరో 14 రోజుల్లోగా మండలి నుంచి అది అసెంబ్లీకి రావాలి. కానీ సభను ఛైర్మన్ నిరవధిక వాయిదా వేయడంతో ఇక అది సాధ్యపడదు. అయితే సాంకేతికంగా 14 రోజుల తర్వాత ఆటోమేటిగ్గా ఆ బిల్లు ఆమోదం పొందినట్టే. అంటే, ఈ నెలాఖరుతో ఆ గడువు తీరిపోతుంది. కాబట్టి జులై 1వ తేదీ నుంచి ప్రభుత్వం యథావిధిగా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ నెల ఒకటో తేదీన జీతాలు ఖాతాల్లో జమ అవుతాయి. కాబట్టి ఉద్యోగులకు ఆందోళన అక్కర్లేదు. ప్రతిపక్షం చెబుతున్నట్టుగా దీనివల్ల ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
Recommended Video
వైసీపీ స్వయంకృతపరాధం అంటున్న టీడీపీ..
వైసీపీ స్వయంకృతపరాధం వల్లే మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించలేదని టీడీపీ అంటున్నది. ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టకుండా సీఆర్డీయే రద్దు,పాలన వికేంద్రీకరణ బిల్లులపై చర్చకు పట్టుబట్టడం వల్లే సభ నిరవధిక వాయిదా పడిందని చెబుతోంది.ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని ఉదయం నుంచి తాము ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని టీడీపీ సభ్యులు వాదిస్తున్నారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టకుండా మంత్రులే అడ్డుపడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. అసలు బడ్జెట్ ఆమోదం కోసమే ఉభయ సభలను సమావేశపరిచి.. తీరా మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడమేమిటి అని ప్రశ్నిస్తున్నారు.