చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్: హోం మంత్రితో గవర్నర్ ఏమన్నారు?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేడిని పెంచింది. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ను ట్యాప్ చేశారని ఏపీ మంత్రులు చెబుతుంటే, అలాంటిదేమీ లేదని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. అసలు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ని ట్యాపింగ్పై గవర్నర్ ఏమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగే జరగలేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్కు ఫోన్ చేసినట్లు తెలిసింది.
అంతేకాదు ‘‘ఒక ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాప్ చేస్తే మీరేం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారని, దీనికి ఆయన ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వివరించారట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై ఓ నివేదికను సమర్పించనున్నారు.
ఈ నివేదకలో చంద్రబాబు ఫోన్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ట్యాప్ చేయించలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఆయన ఇంటిపై నిఘా పెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చిందని నరసింహన్ నివేదికలో పొందుపరిచారని తెలిసింది.
సాధారణంగా అవినీతిపై ఏసీబీకి సమాచారం అందినప్పుడు నిఘా వేస్తుందని, ఆ విషయాన్ని తనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని గవర్నర్ తన నివేదికలో స్పష్టం చేశారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబుపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే మాత్రం దర్యాప్తునకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా అవసరమవుతుందని నివేదికలో పేర్కొన్నారంట.
చంద్రబాబు ఫోన్ సంభాషణలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలతో మంగళవారం సాయంత్రమే గవర్నర్ ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ ఉదంతంపై నివేదిక ఇచ్చేందుకు రాలేదని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక బుధ, గురువారాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ కలుసుకోనున్నారు.