బౌలర్ తో బ్యాటింగ్ ద్వారా.. సెంచరీ కోరుకుంటున్న బీజేపీ
ఉమ్మడి రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కండువా కప్పి ఆయనకు ఆహ్వానం పలికారు. ఇక్కడే నల్లారికి అవమానం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి సహా ఏ ఒక్క నేత హాజరవలేదు. జై సమైక్యాంధ్ర పార్టీలో పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడే ఢిల్లీలో ఉన్నారు.
ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పార్టీలో చేరడానికి వస్తే కనీసం ఒక్క నాయకుడు కూడా హాజరుకాకుండా ఆయన్ను అవమానానికి గురిచేశారనే అభిప్రాయం వినవస్తోంది. కిరణ్ తో ఫోన్ లో మాట్లాడానని, కలిసి పోరాటం చేయడంద్వారా పార్టీని అధికారంలోకి తెద్దామని చెప్పినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడైన సోము కోస్తా జిల్లాలకు చెందిన వ్యక్తి. గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.

రాష్ట్ర పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డిలాంటివారు తప్పితే బీజేపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు లేరు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి ఉన్నప్పటికీ ఆయన రేపో, మాపో టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పార్టీలో చేరడానికి వస్తే బీజేపీ అధిష్టానం కూడా అంత ప్రాధాన్యం ఇవ్వలేదంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా బీజేపీకి ఓట్లు వచ్చాయి.

కిరణ్ కుమార్ రెడ్డికి క్రికెట్ తో అనుబంధం ఉంది కాబట్టి బీజేపీలో ఆయన చేరికను ఆ ఆటతో పోలుస్తున్నారు. బ్యాటింగ్ రాని బౌలర్ నుంచి సెంచరీ కోరుకుంటున్నట్లుగా ఉందంటూ ఉపమానాలిస్తున్నారు. బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి త్వరలోనే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, మధ్య ప్రదేశ్ నుంచి కానీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications