వైఎస్ కొండారెడ్డి అరెస్ట్ వెనక ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంధువు, చక్రాయపేట మండల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ కొండారెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి బంధువునే అరెస్ట్ చేశారంటే చాలా బలమైన కారణమే ఉండాలని ప్రజలు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి కడప జిల్లా దువ్వూరు, ఎర్రగుంట్ల, చక్రాయపేట మీదగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వరకు ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ రహదారి విస్తరణ పనులు చేస్తోంది. 143 కిలోమీటర్ల పనులకు రూ.350 కోట్ల బడ్జెట్తో ఈ పనులు జరుగుతున్నాయి. పనుల్లో వాటా కోసం సంస్థ సిబ్బందిని కొండారెడ్డి రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం. కడప ఎంపీ, రాయచోటి ఎమ్మెల్యేతో మాట్లాడుకున్నామని సంస్థ సిబ్బంది చెప్పినప్పటికీ కొండారెడ్డి వినకుండా ఎంపీ, ఎమ్మెల్యేను కూడా దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.
ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత రవికుమార్రెడ్డి. ఆయన ఈ విషయాన్ని తన వియ్యంకుడు, బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ పెద్దలు కాంట్రాక్టర్ను అసభ్య పదజాలంతో కొండారెడ్డి దూషించారంటూ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలిచ్చివుంటారని భావిస్తున్నారు. కొండారెడ్డిని అరెస్ట్ చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాయచోటి సబ్జైలుకు తరలించారు. ఏయే సెక్షన్ల మీద కేసు నమోదు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు.
బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొండారెడ్డిని అరెస్ట్ చేయక తప్పలేదని, లేదంటే తాము కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయనపై ఉన్న పెద్దలు భయపడివుంటారని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న సంస్థ కాబట్టి సరిపోయిందని, సామాన్యులకు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, కొంతమంది దౌర్జన్యంగా వ్యవహరించి వ్యాపారాలు కూడా లాక్కున్నారని, వారికి వాటికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.