జెసి దివాకర్రెడ్డి: రాజీనామా అస్త్రం వెనుక కారణమిదే
అమరావతి:అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహరం సద్దుమణిగేలా టిడిపి నాయకత్వం చర్యలు తీసుకొంది.కొన్ని డిమాండ్ల సాధన కోసం జెసి దివాకర్రెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారనే ప్రచారం టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే జెసి దివాకర్రెడ్డి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబునాయుడుతో బుదవారం నాడు ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందాను. అందుకే రాజీనామా చేస్తానని అనంతపురం టిడిపి ఎంపీ జెసి దివాకర్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన సంచలనం కల్గించింది. అయితే ఈ విషయం పెద్ద సమస్యే కాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు.
జెసికి బాబు షాక్: అది పెద్ద సమస్యే కాదు, 2029వరకు టిడిపినే, సీమలో ఏకపక్షమే
సమస్యను పరిష్కరించుకొనే విషయంలో చివరి అస్త్రంగా రాజీనామాను ఉపయోగించుకోవాలి. కానీ, చిన్న చిన్న విషయాలకు ఈ రకమైన రాజీనామా అస్త్రాలను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జెసి దివాకర్రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందే
ఏదైతేనేం అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డి రాజీనామా వ్యవహరం పరిష్కారమైంది. ఈ విషయంలో టిడిపి నాయకత్వం వేగంగా చర్యలను తీసుకొంది. దీంతో పార్టీ నష్టపోకుండా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకొన్నారని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.
జెసి దివాకర్రెడ్డి రాజీనామా అస్త్రం వెనుక కారణాలివి
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డి ద్వారా ఆ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని టిడిపి నాయకత్వం దృష్టికి జెసి దివాకర్రెడ్డి తీసుకెళ్ళారని సమాచారం.అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం నుండి సానుకూల స్పందన రాలేదని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే జెసి దివాకర్రెడ్డి రాజీనామా అస్త్రాన్ని ఎంచుకొన్నారనే ప్రచారం కూడ పార్టీలో లేకపోలేదు.
చాగల్లుకు నీరు విడుదల
చాగల్లుకు నీటిని విడుదల చేయాలని తాను చెప్పినా అధికారులు మాట వినలేదని రాజీనామా అస్త్రాన్ని జెసి దివాకర్రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాలపై చాగల్లుకు నీరు విడుదల చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తికర అంశంగా మారింది. చాగల్లుకు నీటిని విడుదల చేయించడంలో జెసి దివాకర్రెడ్డి పై చేయి సాధించారు. దీంతో జెసి వర్గీయులు సంతోషంగా ఉన్నారు.
జెసి రాజీనామా ప్రకటనతో ఇరకాటంలో టిడిపి
చాగల్లుకు నీటిని విడుదల చేయని కారణంగా రాజీనామా చేస్తానని అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డి చేసిన ప్రకటన టిడిపిని ఇరకాటంలో పెట్టింది. అధికార పార్టీకి చెందిన ఎంపీయే ప్రభుత్వతీరును నిరసిస్తూ రాజీనామా చేస్తానని ప్రకటించడం టిడిపిని ఇరుకునపెట్టింది. కలెక్టర్ల సమావేశంలో ఉన్న చంద్రబాబునాయుడు వెంటనే ఈ విషయాన్ని పరిష్కరించాలని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావుకు సూచించారు.దేవినేని ఉమామహేశ్వర్రావు అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డితో ఫోన్లో చర్చించారు. సమస్య పరిష్కారమయ్యేందుకు ప్రయత్నించారు.
మరిన్ని డిమాండ్లతో నేతలు ముందుకు వచ్చే అవకాశం
తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాజీనామా చేస్తామని మరికొందరు నేతలు కూడ ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకొనేందుకు రాజీనామా అస్త్రాన్ని ముందుకు తెచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆయా రాజకీయనేతల పలుకుబడి కూడ వారి డిమాండ్లు నెరవేరే విషయంలో ఆధార పడి ఉంటుందనే అభిప్రాయాలు లేకపోలేదు.అయితే జెసి దివాకర్రెడ్డి తాజా ప్రకటన మాత్రం టిడిపికి మంచి అనుభవాన్ని నేర్పిందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.