ఏపీలో ఇంటింటికీ జగన్ వెనక ఏం జరగబోతోంది?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్న సరికొత్త కార్యక్రమం వెనక ఆ పార్టీ ప్రయోజనాలు అనేకం ఇమిడివున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి వారు ఇంటింటికీ తిరిగి పథకాలను వివరించాల్సిన అవసరం లేదని, ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకతను తగ్గించడానికి, ఆ వ్యతిరేకత తనపై రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులపై నెట్టేసేలా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక రచించారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విశ్లేషించి చెబుతున్నారు.

తెలుగుదేశం బలాన్ని అంచనా వేస్తారు
ఏడాదిపాటు నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉండటంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఇప్పటికే ప్రజలు ఎమ్మెల్యేలనే వెంటబడి తరుముతున్నారంటూ ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఉదహరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కార్యక్రమం ప్రయోజనమని, కానీ అదిఎట్టి పరిస్థితుల్లోను నెరవేరదంటున్నారు. నియోజకవర్గాలవారీగా, మండలాలవారీగా, గ్రామాలవారీగా తెలుగుదేశం పార్టీ బలాలను అంచనా వేస్తారని, ఆ తర్వాత తమ పార్టీ ఎక్కడెక్కడ ఓటమిపాలవుతుందనేది తెలుసుకుంటారని, దానికి విరుగుడుగా ఏం చేయాలనేది నిర్ధేశించుకుంటారన్నారు.

తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తారు
ఎమ్మెల్యేలమీద వ్యతిరేకత వ్యక్తమైన చోట్ల వారిని మారుస్తారని, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తారని, రాని నాయకులపై కేసులు పెట్టడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం లాంటివి చేస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం బలంగా ఉన్నవి, కచ్చితంగా గెలవగలిగే నియోజకవర్గాలను గుర్తించి అక్కడ క్రమంగా తమ పార్టీని బలహీనపరిచే కార్యక్రమాన్ని అమలు చేస్తారని చెపుతున్నారు.

ఏడాదిలోపే ఎన్నికలకు వెళ్లొచ్చు!!
అందుకే తమ పార్టీ సూసైడ్ బ్యాచ్ను సిద్ధం చేసుకుందన్నారు. ఈ సంవత్సరంపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సర్వేలాంటిదని, నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలతోపాటు ఇంటిలిజెన్స్ సర్వే కూడా నిర్వహించుకొని ఏడాదిలోపే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చనే అభిప్రాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జనసేనతో పొత్తు దాదాపు ఖాయం కావచ్చనే అంచనాలుండగా దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలనే అంశాన్ని కూడా అధికార పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందంటున్నారు. ఇది పైకి చెబుతున్నట్లు ఇంటింటికీ వైసీపీ నేతల ప్రచారంలానే ఉంటుందికానీ అంతర్గతంగా ఇతర పార్టీలను దెబ్బతీయడానికే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications