రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలి ..బీజేపీ,జనసేన పొత్తు వారి ఇష్టం : చంద్రబాబు
రాయీపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . రాజధాని అమరావతి కోసం పోరాటం సాగుతుండగానే అనుకోనివిధంగా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజకీయ అనివార్యత దృష్ట్యా ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. అది వారి ఇష్టం అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేమీ లేదన్నారు .అది వారి అంతర్గత నిర్ణయమన్నారు.

జనసేన, బీజేపీ కలిసి పనిచేయటం వారి అభీష్టమన్న చంద్రబాబు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో రాజధాని అమరావతి కోసం ఇరు పార్టీలు కలిసి పని చేస్తే బాగుంటుంది అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని అది వారి అభీష్టమని చెప్పిన చంద్రబాబు భవిష్యత్లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశంపై రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఒకవేళ బీజేపీ స్నేహహస్తం అందిస్తే చంద్రబాబు కలిసి పని చేస్తారనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది.

రాయలసీమను పట్టించుకోలేదన్న వైసీపీ ఆరోపణలకు స్పందించిన చంద్రబాబు
ఇక అసెంబ్లీ వేదికగా రోజా మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం రాయలసీమ గురించి కూడా మాట్లాడని చంద్రబాబు సిగ్గు లేకుండా వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని ఆమె మాట్లాడారు. ఇక ఈ నేపధ్యంలో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ ఆరోపణలకు సమాధానంగా తాను రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తినేనని, అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తినని చంద్రబాబు గుర్తుచేశారు. తనకు సాధ్యమైనంత రాయలసీమ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు చంద్రబాబు .

రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది తాము కాదా అన్న చంద్రబాబు
అసలు రాయలసీమ గురించి మాట్లాడటానికి మీరెవరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తనను ప్రశ్నించే ముందు రాయలసీమకు మీరేం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు టీడీపీ హయాంలో ఇచ్చామని గుర్తు చేసిన ఆయన అది మీకు తెలీదా అని నిలదీశారు. హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులను నాడు ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తిచేశానని చంద్రబాబు చెప్పారు.

అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చింది తామేనని గుర్తు చేసిన బాబు
అనంతపురానికి కియా మోటార్స్ను తీసుకొచ్చింది తమ హయాంలో కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీసిటీకి టీడీపీ హయాంలో పలు పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు జగన్ ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు . వైఎస్ గానీ, జగన్ గానీ రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు చంద్రబాబు .












Click it and Unblock the Notifications