మెరుగైన సమాజ ఉద్యమకారుడి ప్రయాణం: హైదరాబాద్ టు ముంబై వయా కర్ణాటక!
అమరావతి: సమకాలీన రాజకీయాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు వాడివేడిగా విమర్శలు సంధించే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి. టీవీ9 రవిప్రకాష్ ఉదంతంలో ఆయన మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయనపై నిప్పులు చెరిగారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరినీ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కరవును, అక్కడ నెలకొన్న దుర్బిక్ష పరిస్థితులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిపై ఆరోపణలు సంధించారు.
మెరుగైన సమాజ ఉద్యమకారుడు..పరారీ
అజ్ఞాతంలో ఉన్నటుగా, ఉద్వాసనకు గురైనట్టుగా చెబుతోన్న టీవీ9 న్యూస్ ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవిప్రకాశ్పై ప్రశ్నలవర్షం కురిపించారు విజయసాయి రెడ్డి. రవిప్రకాశ్ను మెరుగైన సమాజ ఉద్యమకారుడిగా అభివర్ణించారు. మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఆయన కోసం సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ బృంద పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటోన్న ఏపీ రాజధాని అమరావతికి వెళ్లడానికీ రవిప్రకాశ్ భయపడ్డాడరని అన్నారు. అమరావతికి వెళ్తే ఈ నెల 23వ తేదీ తరువాత దొరికే ప్రమాదం అనుమానించినట్లు చెప్పారు. అందుకే కర్ణాటక మీదుగా హైదరాబాద్ నుంచి ముంబైకి ఉడాయించినట్లు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. `నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?..` అని ఆయన రవిప్రకాశ్ను నిలదీశారు.
ఆర్థికవేత్తలకు పాఠాలు చెప్పిన చంద్రబాబు హయాంలో నష్టాల్లో ఆర్టీసీ
ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లి అక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని, ఆర్థికరంగంలో పాఠాలు చెబుతుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డప్పులు కొట్టుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఆర్థికవేత్తలకు పాఠాలు చెప్పిన చంద్రబాబు హాయంలో ఆర్టీసీ 6,500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉండటం ఆశ్చర్యకరమని అన్నారు. ఆర్టీసీని 6,500 కోట్ల నష్టాల్లోకి ఎందుకు నెట్టావు చంద్రబాబూ అంటూ నిలదీశారు. ఏటా 650 కోట్ల రూపాయల చొప్పున నష్టాలు వస్తోంటే చంద్రబాబు నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు ఏం చేసినట్టు అని ప్రశ్నించారు. పోలవరం సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజిగా ఉన్నారా అంటూ విమర్శించారు.
అనంతపురంలో మరణ మృదంగాలు..
ఏటేటా అనంతపురం జిల్లా తీవ్ర కరవును, దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటూనే వస్తోందని సాయిరెడ్డి అన్నారు. దుర్భిక్ష పరిస్థితులతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరణ మృదంగాలు మోగుతున్నాయని ధ్వజమెత్తారు. కరవు బారిన పడిన వేలాది కుటుంబాలు కర్ణాటకకు వలస పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు మేత లేక కబేళాలకు తరలిస్తున్నారని చెప్పారు. రెయిన్ గన్లతో కరవును పారద్రోలానని చెప్పుకొన్న చంద్రబాబు ఈ పరిస్థితులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవాతో నీటిని పారించానని, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రజలను మోసగించారని మండిపడ్డారు.
పారదర్శక పాలన పేరుతో రహస్య జీవోలు
చంద్రబాబు నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వ హాయంలో అనేక రహస్య జీవోలు విడుదలవుతున్నాయని, ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని సాయి రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పోర్టల్ లో పెట్టని రహస్య జీవోలన్నిటిని గవర్నర్ గారు జోక్యం చేసుకొని బయట పెట్టించాలని అన్నారు. వందల జివోలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తన విమానం అద్దెలు, దొంగ చెల్లింపుల జివోలన్నటిని దాచి పెట్టారని, కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగానే బండారం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.