వారికి ఒక్కటి, ద్రోహులకు 50: పొన్నాల, దామోదర ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ మంత్రి, టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిసిఎం దామోదర రాజనర్సింహ శుక్రవారం మండిపడ్డారు. తెరాస ఒక్క అమరవీరుల కుటుంబాలకు సీటు ఇచ్చి, 50 మంది తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు. విధి విధానాలు, సిద్ధాంతాలు లేని పార్టీ తెరాస అన్నారు. అదో ఉప ఎన్నికల పార్టీ అని ఎద్దేవా చేశారు.
సెంటిమెంటు, సానుభూతితో లబ్ధి పొందాలని కెసిఆర్ అనుకుంటారని, తెరాస అసలు రాజకీయ పార్టీయే కాదన్నారు. తెరాస మానిఫెస్టో అంతా బూటకమన్నారు. మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఒక్క మైనార్టీకి టిక్కెట్ ఇచ్చారని దుయ్యబట్టారు. తాము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామన్నారు. మాట తప్పే విధానం కాంగ్రెసుకు లేదని వ్యాఖ్యానించారు.

తెరాస కలగూర గంప పార్టీ అన్నారు. అధికార దాహంతో కెసిఆర్ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలలో గెలుపు వాపు అని, ఆ వాపును చూసి బలుపు అనుకుంటోందని మండిపడ్డారు. బిజెపితో పొత్తుకు వెంపర్లాడటంపై మైనార్టీలకు ఏం సమాధానం చెబుతారన్నరు. ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎన్ని టిక్కెట్లు ఇచ్చామో తమ జాబితో విడుదల చేశాక చూస్తే అర్థమవుతుందన్నారు. తెరాస ఉద్యమానికి అడ్డుపడిన వారికి టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు. తనను జైలుకు పంపుతారన్న కెసిఆర్కు సిబిఐ తనకు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలియదా అన్నారు.
దళితులకు, మైనార్టీలకు హామీలిచ్చి మాట తప్పింది కెసిఆరేనని దామోదర రాజనర్సింహ అన్నారు. మోసగాడి చేతిలో తెలంగాణ పెడితే నట్టేట ముంచుతాడన్నారు. పునర్ నిర్మాణం అంటే కూలిన గడీలు నిర్మించడం కాదని, కాంగ్రెసుతోనే నవ తెలంగాణ సాధ్యమన్నారు. కెసిఆర్కు తెలంగాణ ప్రాంతం జాగీరుగా మారిందని, కూతురుకు నిజామాబాద్, కొడుక్కి కరీంనగర్, అల్లుడికి మెదక్, ఇతర జిల్లాలు కెసిఆర్ కట్టబెట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications