జగన్ బుజ్జగించినా.. దూరమెందుకు: టిడిపిలోకి ఎవరెవరు, చిక్కులేంటి?
విజయవాడ: వైసిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు త్వరలో టిడిపిలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. మార్చి 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందే వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కృష్ణా జిల్లా నుంచి జలీల్ ఖాన్, విజయనగరం జిల్లా నుంచి సుజయ కృష్ణ రంగారావు, ప్రకాశం జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు టిడిపిలో చేరే వారి జాబితాలో వినిపిస్తున్నాయి.
మొబైల్
లైఫ్
;
ఈ
రోజు
కార్టూన్
ఇందులో కొందరు నేతలు తాము టిడిపిలో చేరే ఊహాగానాలను కొట్టి పారేస్తున్నారు. అయినప్పటికీ కొందరి పేర్లు పదేపదే వినిపిస్తున్నాయి. ఇటీవల జలీల్ ఖాన్ సీఎం చంద్రబాబును కలిశారు. అప్పుడే ఆయన చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన ఆ వార్తల్ని ఖండించారు.
ఏది ఏమైనా పలు జిల్లా నుంచి దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. వారి చేరికకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, వైసిపి నేతల చేరికతో అసంతృప్తికి గురవుతున్న తమ పార్టీ నేతలను చంద్రబాబు, ఇతర నేతలు బుజ్జగిస్తున్నారు.
భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్లు ఈ రోజు సాయంత్రం టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది. వీరిని జగన్, ఆయన పార్టీ నేతలు ఎంత బుజ్జగించినప్పటికీ తగ్గటం లేదని తెలుస్తోంది. వీరి చేరిక నేడో, రేపో జరగనుందని అంటున్నారు.
ఆదినారాయణ రెడ్డి
గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. ఆయన టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు ఏడెనిమిది నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. తన బంధువు కేశవ రెడ్డి కేసుల్లో ఇరుక్కోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
రామసుబ్బా రెడ్డి
రామసుబ్బా రెడ్డి టిడిపి కడప జిల్లా సీనియర్ నేత. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఈయన ఆదినారాయణ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈయన్ని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు టిడిపిలో గౌరవం ఉన్నంత వరకే ఉంటానని ఖరాఖండిగా రామసుబ్బా రెడ్డి చెప్తున్నారు.
భూమా నాగిరెడ్డి
కడప జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు వైసిపిని వీడాలని నిర్ణయించుకోవడం జగన్ జీర్ణించుకోలేని విషయమే. దివంగత శోభా నాగిరెడ్డి... జగన్కు అండగా ఉండేవారు. భూమా చేరికకు.. తమ నియోజకవర్గాల అభివృద్ధియే కారణంగా తెలుస్తోంది. అంతేకాక, కర్నూలులో టిడిపి పట్టు కోసం చంద్రబాబు.. భూమాకు మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కెఈ, శిల్పా సోదరులు
కడప జిల్లాలో భూమా కుటుంబం టిడిపిలోకి వచ్చేందుకు చంద్రబాబు మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన నేత, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి.. భూమా రాకను స్వాగతిస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోదరులకు కూడా చంద్రబాబు నచ్చచెబుతున్నారు. అయితే, భూమా చేరికను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
సుజయ, బొత్స
విజయనగరం జిల్లాకు చెందిన సుజయ కృష్ణ రంగారావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుజయ వర్సెస్ బొత్స సత్యనారాయణలుగా ఉంటుంది. అయితే, బొత్స కొద్ది నెలల క్రితం వైసిపిలో చేరారు. బొత్స చేరిక సుజయ కృష్ణ రంగారావు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.
జలీల్ ఖాన్
కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా సైకిల్ ఎక్కుతారనే ఊహాగానాలు చాలా రోజులుగా వస్తున్నాయి. వీటిని ఆయన ఖండించారు. అయినప్పటికీ భూమా, ఆదినారాయణ రెడ్డిలతో పాటు ఆయన కూడా టిడిపిలో చేరుతారని అంటున్నారు. టిడిపికి మైనార్టీ ఎమ్మెల్యే లేరు. జలీల్ ఖాన్ చేరితే ఆయనను మంత్రి పదవి వరించే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరనున్నారని తెలుస్తోంది.