తెలంగాణ ప్రజల భయాన్ని గుర్తించారా?: అందుకే బాబు అలా...
వరంగల్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల మనసులను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు కనిపించారు. తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న భయాలను, అనుమానాలను నివృత్తి చేయడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అనిపిస్తోంది. గురువారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆయన అనేక విషయాలను తడిమారు.
తనపై, తన పార్టీపై ఉన్న అనుమానాలను తొలగించాడనికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు ఎంత ముఖ్యమో తెలంగాణ కూడా అంతే ముఖ్యమని, తన చూపులో వివక్ష లేదని, తెలంగాణ పట్ల విశేషమైన ఆదరాభిమానాలున్నాయని చెప్పడానికి ప్రయత్నించారు. పేరెత్తకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ని, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును విమర్సించారు. కెసిఆర్ తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నించారు.
అంతకన్నా ముఖ్యంగా ఆయన ప్రసంగంలోని ప్రధానాంశం రెండు రాష్ట్రాలూ తిరిగి విలీనం కాబోవని ప్రకటించడం. అలా ప్రకటించడం ద్వారా ఆయన తెలంగాణ ప్రజల భయాలను, సందేహాలను తొలగించడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో విలీనం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారనే విమర్శ ఉంది. ఆ విమర్శలో నిజం లేదని చెప్పడానికి ఆయన ఆ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నారు. తిరిగి విలీనమంటే తెలంగాణ ప్రజల్లో భయాలు ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గ్రహించినట్లే ఉన్నారు. ఆ గ్రహింపు కారణంగానే రెండు రాష్ట్రాలు తిరిగి విలీనం కాబోవని స్పష్టం చేశారు.
ఆ తర్వాత రెండు రాష్ట్రాలు కూడా తనకు సమానమేనని చెప్పడానికి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను చెబుతూ తెలంగాణ కష్టాలను కూడా తీర్చడానికి తాను ముందున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎదుర్కుంటున్న కరెంట్ సమస్యను ఎలా తీర్చవచ్చునో, దానికి తాను ఏం చేస్తానో చెప్పి తెలంగాణ ప్రజలకు తనపై విశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ప్రసంగమంతా చాటుకోవడానికి ప్రయత్నించారు. చాలా వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా చంద్రబాబు తన ప్రసంగాన్ని రూపొందించుకున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రజల నుంచే కాదు, ఇతర పార్టీల నాయకుల నుంచి కూడా ఏ విధమైన విమర్శలు రాకుండా చూసుకునేందుకు, అందరికీ అది అంగీకార యోగ్యంగా ఉండేట్లు జాగ్రత్త పడినట్లు కనిపిస్తున్నారు.
కాగా, వరంగల్ సభ విజయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఉత్సాహంగా కనిపించారు. తిరిగి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలం పుంజుకోవడానికి చంద్రబాబు సభ ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఏమైనా, చంద్రబాబు అత్యంత శ్రద్ధగా తన కార్యక్రమాన్ని, ప్రసంగాన్ని రూపొందించుకుని తిరిగి తెలంగాణలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇది నాందిగా చెప్పవచ్చు.