'గడప గడపకు ప్రభుత్వం' కొనసాగుతున్నా మళ్ళీ మంత్రుల బస్సుయాత్రలు దేనికి? ఏపీలో ఆసక్తికరచర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు పలు కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. బాదుడే బాదుడు పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను రంగంలోకి దింపి సంక్షేమ ఫలాలు గడపగడపకు అందుతున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తుంది.

గడప గడపకూ మన ప్రభుత్వం.. మధ్యలో మళ్ళీ వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్లాల్సిందేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ సమావేశంలో తేల్చిచెప్పారు. ఇక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న మంత్రులకు ప్రజల నుండి కొంత నిరసన వ్యక్తమవుతోంది. ఇక ప్రజల నుండి వ్యక్తం అవుతున్న నిరసనలను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. అనేకచోట్ల వ్యతిరేకత మధ్య గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం ఆశించిన రీతిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఆ కార్యక్రమాన్ని ఆపలేక, కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న జగన్ తాజాగా మరో కొత్త యాత్రకు ప్లాన్ చేశారు.

వైఎస్సార్సీపీ బస్సు యాత్ర.. సామాజిక న్యాయం పేరుతో
ఈసారి ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు వైయస్సార్ సిపి బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజల వద్దకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర ద్వారా వెళ్లనున్నారు. ఇక ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. దీనిపై ఫైనల్ డెసిషన్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగే సమయంలో ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు నాలుగు చోట్ల బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ కార్యక్రమాలపై ఏపీ ప్రజల్లో జోరుగా చర్చ
అయితే ఏపీ ప్రజల్లో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్న క్రమంలో మళ్లీ కొత్త యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏమిటి అన్న చర్చ జోరుగా సాగుతుంది. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడానికి చేస్తున్న కార్యక్రమం అయితే, వైయస్సార్సీపి బస్సు యాత్ర మూడేళ్ల వైయస్ఆర్సిపి పాలనలో వివిధ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం ఏవిధంగా జరిగిందో చూపించేందుకు నిర్వహిస్తున్నట్టు వైసిపి వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం వైసిపి కార్యక్రమాలపై జోరుగా చర్చ జరుగుతుంది.

గడప గడపకూ ప్రభుత్వం అనుకున్నంత సక్సెస్ కాకపోవటమే బస్సు యాత్రకు కారణమా?
గడపగడపకు మన ప్రభుత్వం అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బస్సు యాత్ర పేరుతో వైసిపి కొత్త ప్లాన్ చేసిందని భావిస్తున్నారు. ఇటు వైసీపీ శ్రేణులలోనూ పార్టీ నిర్ణయంపై చర్చ జరుగుతుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మళ్లీ బస్సు యాత్ర లో పాల్గొనడం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న ఒక కార్యక్రమంలో మరో కార్యక్రమం చొప్పించటం వైసీపీ శ్రేణులకు మంత్రుల కు ఇబ్బందిగా మారింది.

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే మంత్రులను పరుగులు పెట్టిస్తున్న జగన్
రాష్ట్రంలో మళ్లీ అధికారం రావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే వైసీపీ మంత్రులను నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు అన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక మరోమారు ఉత్తరాంధ్ర నుంచి సామాజిక యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించి అనంతలో ముగించాలని నిర్ణయించిన వైఎస్సార్సిపి బస్సుయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్న చర్చ కూడా ఏపీ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications