ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టా: జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా పవన్పై వైసీపీ మౌనం వెనుక?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన ఏపీ పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అందుకే తాను హామీ ఇవ్వలేదని, అలాంటి వ్యక్తికి తాను ఎలా మద్దతిస్తానని ఘాటు వ్యాఖ్యలే చేశారు.
అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని
పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చినప్పటికీ జనసేనాని అంత ఘాటుగా విమర్శలు చేస్తే, వైసీపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో కనిపించలేదని అంటున్నారు. అంతేకాదు, తనను విమర్శించడానికి అలాంటి అస్త్రాలు విపక్షాల వద్ద లేవని కూడా పవన్ అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆందోళనలో ఉన్నారా?
జగన్పై పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై వైసీపీ నుంచి అంతేస్థాయిలో ప్రతిస్పందన ఎందుకు రావడం లేదనే చర్చ సాగుతోంది. జనసేనాని చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియడం లేదా? లేదంటే అలాంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లకూడదని అనుకుంటున్నారా? అనే చర్చ సాగుతోంది.
వైసీపీ, జగన్ను ఏకిపారేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఇటీవల నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించారు. జగన్పై ఉన్న అవినీతి ఆరోపణల గురించే కాదు, ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్న జగన్పై కూడా అంతెత్తున లేచారు. సీఎం పదవి ఉంటేనే ప్రజలకు ఏమైనా చేయవచ్చుననే ధోరణి నుంచి జగన్, వైసీపీ బయటపడాలని హితవు పలికారు. సీఎం కవడానికి అనుభవం కూడా ఉండాలన్నారు.
పవన్ కళ్యాణ్ను ఏమీ అనలేకేనా
పవన్ కళ్యాణ్ను విమర్శించేందుకు వారి వద్ద ఆయుధాలు ఏమీ లేవని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆయన పదవిని కోరుకోవడం లేదని, అభివృద్ధి కోసం చంద్రబాబుకు సహకరిస్తున్నానని చెబుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనానిని కచ్చితంగా ఇరుకున పెట్టేందుకు వారి వద్ద సరైన ఆయుధాలు లేవని అంటున్నారు. అందుకే పదేళ్ల క్రితం నాటి ప్రజారాజ్యంను తీసుకు వచ్చి పవన్ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకే
తమపై ఇతర పార్టీలు విమర్శలు చేసినప్పుడు ఆయా పార్టీలు అందుకు ధీటుగా స్పందిస్తాయి. కానీ పవన్ విషయంలో వైసీపీ మాత్రం అలా చేయలేకపోతుందని అంటున్నారు. ఒకరిద్దరు పార్టీ నేతలు స్పందించినప్పటికీ, అంత దూకుడు కనిపించలేదని అంటున్నారు. జనసేనానిపై ఎలా రియాక్ట్ అవ్వాలో వారికి తెలియకే ఒకింత మౌనంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
ఆయుధాల్లేవు, విమర్శిస్తే ధీటుగా స్పందిస్తారు
పవన్ కళ్యాణ్పై తీవ్రంగా స్పందిస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై వైసీపీ వర్గాలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయట. పవన్ను తీవ్రంగా విమర్శిస్తే కచ్చితంగా పవన్ కూడా రియాక్టవుతారు. దాని వల్ల ప్రయారిటీ అంతా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ విఫలమైనట్లుగా ప్రచారం సాగుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి వస్తే అది వైసీపీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారట.
మౌనానికి ఇదీ కూడా కారణం కావొచ్చు
ఇప్పటికే టీడీపీ.. వైసీపీ కంటే జనసేననే అసలైన ప్రతిపక్షంగా అభిప్రాయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు మరింత హైప్ తీసుకు రావొద్దని, అందుకు మౌనంగా ఉండటమే బెట్టర్ అని ఆలోచన చేస్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉందని అంటున్నారు. రోజా వంటి ఒకరిద్దరు నేతలు మాత్రం ఎప్పటిలాగే పవన్కు కౌంటర్ ఇచ్చారు. కానీ ధీటుగా మాత్రం ఎవరూ ఇవ్వలేకపోయారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు అవసరమని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారని ప్రచారం జరిగింది. 2019లో అవసరం దృష్ట్యా ఇప్పుడు మౌనం వహిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.