బ్రదర్ అనిల్ రాకతో వీరికే ముప్పు ! క్రైస్తవ సంఘాల ఉలికిపాటు వెనుక ? ఏం జరుగుతోంది?
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మూడేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యర్ధులు దూకుడు పెంచుతున్నారు. దీంతో అటు జగన్ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే జగన్ తో విభేదిస్తున్న ఆయన బావ బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జగన్ కు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నవారితో సమావేశాలు పెడుతూ కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన్ను అడ్డుకునేందుకు వైసీపీ క్రైస్తవ సంఘాల్ని రంగంలోకి దించుతోంది.
బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ
ఏపీలో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఈ మధ్య సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. తొలుత విజయవాడలో, అనంతరం విశాఖలో ఆయన పర్యటించారు. త్వరలో మిగతా ప్రాంతాలకూ వెళ్లబోతున్నారు. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేకపోయినా సదరు పర్యటనల్లో ఆయన కలుస్తున్నవారు, చేస్తున్న వ్యాఖ్యలు, జరుగుతున్న ప్రచారం అంతా చూస్తుంటే బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్ధాయిలో వ్యూహరచన సాగుతున్నట్లు కూడా అర్దమవుతోంది.
జగన్ పై అసంతృప్తులే టార్గెట్
తన బావమరిది, సీఎం వైఎస్ జగన్ కు రెండున్నరేళ్ల క్రితం దగ్గరుండి మరీ ఓట్లేయించిన మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ అప్పట్లో అలా ఓటేసిన వారినే ఇప్పుడు కలుస్తున్నారు. అందులోనూ అప్పట్లో ఓటు వేసి ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న వారినే బ్రదర్ అనిల్ టార్గెట్ చేసుకుంటున్నారు.
వారితో సమావేశమై తానున్నానని భరోసా ఇస్తున్నారు. బ్రదర్ అనిల్ చెప్పారని ఓటేసిన తమకు వందకు వంద శాతం అన్యాయం జరిగిందని వారంతా ఇప్పుడు వాపోతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో వీరే బ్రదర్ అనిల్ కు ఆయుధాలుగా మారబోతున్నట్లు అర్దమవుతోంది.
అప్రమత్తమైన జగన్
తన బావ బ్రదర్ అనిల్ ఏపీలో వరుస పర్యటనలు చేస్తుండటం, ఈ పర్యటనల్లో ఆయన కలుస్తున్న వారంతా తనపై ఏదో విధంగా అసంతృప్తిగా ఉన్నవారే కావడంతో సీఎం జగన్ అప్రమత్తం అవుతున్నారు. తన ప్రభుత్వంపై ఇన్నాళ్లూ ప్రజల్లో పాజిటివ్ వేవ్ ఉందని భావించిన జగన్.. ఇప్పుడు అసంతృప్త స్వరాలు వినిపిస్తుండటంతో అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా గతంలో తనకు ఓటేసిన వారు ఇప్పుడు తనకు వ్యతిరేకులుగా ఎలా మారారాన్న దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తిని మొగ్గలోనే తుంచేసేందుకు వ్యూహరచన సాగుతోంది.
క్రైస్తవసంఘాలతో ఎదురుదాడి
ఏపీలో బ్రదర్ అనిల్ వ్యూహాలతో అప్రమత్తమైన వైసీపీ, సీఎం జగన్..ఇప్పుుడు ఆయన్ను ఆదిలోనే ఎదుర్కొనేందుకు ఎదురుదాడి మంత్రాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెరపైకి వస్తున్న క్రైస్తవ సంఘాలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ బ్రదర్ అనిల్ పై విమర్శలకు దిగుతున్నారు. అదీ మత ప్రచారకుడికి రాజకీయాలు ఎందుకన్న కోణంలోనే వారి విమర్శలు ఉంటున్నాయి.
దేవుడి ముగుసులో రాజకీయాలు ఎందుకంటూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. గతంలో చర్చిలు కట్టిస్తామని, పాస్టర్లకు జీతాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఏపీలో మీ రాజకీయాన్ని అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు చేస్తున్నారు.
జగన్ భయపడుతున్నారా?
బ్రదర్ అనిల్ రాకతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న దానిపై ఇప్పుడు ఎవరికీ క్లారిటీ లేదు.ఆయనకు ఉన్న ఓటు బ్యాంకు ఎంతో కూడా ఎవరికీ తెలియదు. బ్రదర్ అనిల్ ఏపీ పర్యటనలో కలుస్తున్న వారి ఓట్ల సంఖ్య కూడా తెలియదు. అయినా ఆయనపై క్రైస్తవ సంఘాలు ప్రభుత్వ మద్దతుతో విమర్శలకు దిగుతున్నాయి.
బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతామంటే వీరికి వచ్చిన నష్టమేంటో కూడా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో వీరి వెనుక ఉన్నారని భావిస్తున్నసీఎం జగన్.. తన సొంత బావ బ్రదర్ అనిల్ రాజకీయ వ్యూహాలపై ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏపీలో రాజకీయంగా బలంగా ఉన్నామని రోజూ చెప్పుకుంటున్న జగన్.. ఇప్పుడు ఇంకా రాజకీయ పార్టీ పెట్టని, ఓటు బ్యాంకేంటో కూడా తెలియిని బ్రదర్ అనిల్ పై ఎదురుదాడి చేయించడం వెనుక ఏముందనే చర్చ కొనసాగుతోంది. ఇంకా పుట్టని పార్టీని చూసి జగన్ భయపడాలా అన్న చర్చ కూడా జరుగుతోంది.