'పవన్ తెలంగాణను చూసి నేర్చుకో, మిలిటెంట్ తరహా ఉద్యమాలు'
అమరావతి: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదని, సినిమా నటుడు అని మాల మహానాడు అధినేత కారెం శివాజీ అన్నారు. ఎంతో ప్రజాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్పక వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని చూసైనా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు త్వరలో మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం డిసెంబర్ 7వ తేదీన పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పారు. బీహార్, కాశ్మీర్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన ప్రధాని మోడీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను రక్షించుకోవడానికి త్వరలోనే జాతీయ సదస్సును నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. గ్రామాల్లోని దళితుల భూములను గ్రామ పెద్దలు ఆక్రమించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత వరకు శిక్ష పడినట్లు చరిత్రలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.