మన కంపెనీలతో దావోస్ లో ఒప్పందాలా ? ముంబై పారిశ్రామికవేత్త ట్వీట్-జగన్ ఎంఓయూల వేళ
దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు జరుగుతోంది. ఇందులో భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొంటున్నారు. వీరు భారతీయ సంస్ధలతో అక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. భారత్ కు చెందిన సంస్ధలతో భారత్ లోనే ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నా దావోస్ వెళ్లి మరీ ఒప్పందాలు చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త ఒకరు ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు.

దావోస్ లో పెట్టుబడుల వేట
ప్రతీ ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, పెట్టుబడిదారులు తరలివస్తుంటారు. ఇక్కడ ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతల్ని పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటారు. అవి పెట్టుబడిదారులకు నచ్చితే అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈసారి కూడా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇలాంటి పలు ఒప్పందాలు జరుగుతున్నాయి.

మన కంపెనీలతో నేతల ఒప్పందాలు
అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే విదేశీ సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మన రాజకీయ నేతలు దావోస్ వెళ్లారంటే ఫర్వాలేదు. కానీ భారతీయ కంపెనీలతో ఒప్పందాల కోసం మన రాజకీయ నేతలు దావోస్ వెళ్తుండటం ఇక్కడ విచిత్రంగా కనిపిస్తోంది.
భారత్ లోనే ఆయా సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలుంది. అయినా వీరంతా దావోస్ వెళ్లి మరీ మన పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. ఇదే విషయాన్ని ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త ఒకరు ట్వీట్ చేశారు.

దినేష్ జోషీ ట్వీట్
ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త దినేష్ జోషీ భారత్ లోని రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ఇందులో దావోస్ వెళ్లి మన రాజకీయ నేతలు మన పారిశ్రామిక వేత్తలు ఒప్పందాలు చేసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మనోళ్లు దావోస్ వెళ్లి మరీ మన పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. దీంతో తాజాగా అదానీ వంటి దేశీయ సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వంటి వారు ఇరుకునపడుతున్నారు. ఇదే క్రమంలో దేశంలో మరికొంతమంది రాజకీయ నేతలు దేశీయ సంస్ధలతో దావోస్ లో ఒప్పందాలు చేసుకుంటున్నవారు కూడా ఆలోచనలో పడ్డారు.

అందరికీ కావాల్సింది ఇదే!
భారత్ లో పారిశ్రామిక వేత్తలు దావోస్ వెళ్లడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అలాగే భారత్ లో రాజకీయ నేతలు కూడా దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకురావడాన్ని అలాగే భావిస్తారు. దీంతో భారత్ లో వీరిద్దరూ చేసుకునే ఒప్పందాల కన్నా దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకుంటే ఇద్దరికీ మైలేజ్ వస్తుందన్న చర్చ పారిశ్రామిక, ప్యాపార వర్గాల్లో ఎప్పుడూ ఉండేదే. ఇప్పుడు భారతీయ నేతలు దావోస్ లో భారతీయ పారిశ్రామిక వేత్తలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కూడా ఇదే కోవలోకి వస్తాయనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications