జగన్కు మోకాలడ్డుతున్న షర్మిల
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటుచేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు.

సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.
ఇండియా భాగస్వామ్య పక్షాలు ఈ ఆందోళనకు హాజరైనప్పటికీ.. ఈ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రాతినిథ్యం లోపించిందిక్కడ. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా గుర్తు చేసింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడింది.
దీనిపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని నిలదీశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? అయిదు సంవత్సరాల పాటు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకున్నందుకా? అని ప్రశ్నించారు.
ఏపీ విభజన హక్కులు, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. చివరికి మణిపూర్ ఘటనపైనా నోరెత్తని వైఎస్ జగన్కు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. క్రిస్టియన్ అయివుండీ మణిపూర్లో క్రైస్తవులను ఊచకోతకు గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అంటూ గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారని షర్మిల పేర్కొన్నారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప, రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications