రజనీకాంత్ లింగా షూటింగ్ను అడ్డుకోవడం వెనక?
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కాలంలో సినిమా షూటింగ్లను అడ్డుకోవడం సంప్రదాయంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా, రంగారెడ్డి జిల్లాలోని అనాజ్పూర్ గ్రామంలో ప్రజలు రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్ను అడ్డుకున్నారు. దాని వెనక కారణమేమిటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో లింగా షూటింగ్ జరుగుతోంది. లింగా షూటింగ్ కోసం చెరువులో రసాయనాలు కలుపుతున్నారని, దానివల్ల నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ కారణం చూపి లింగా షూటింగ్ను అడ్డుకోవడానికి గ్రామప్రజలు ప్రయత్నించారు.
నీటి పారుదల శాఖ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి తాము అనుమతి తీసుకున్నామని సినిమా యూనిట్ చెప్పినా ప్రజలు వినలేదు. చెరువులో నీరు కలుషితమవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని వారన్నారు. అంతకు ముందు కూడా గ్రామ ప్రజలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాహుబలి సినిమా షూటింగ్ను అడ్డుకుంటామని చెప్పారు. ఆ సినిమా షూటింగ్ను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
లింగా సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభియం చేస్తున్నారు. ఆయనకు జోడీగా అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. కెఎస్ రవి కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ పుట్టిన రోజు సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.