పెదరాయుడు కోరితే జగన్ ఆమోదిస్తారా- "మెగా" మిడిల్ డ్రాప్ వెనుక : ఏపీ ఇష్యూలో హీరో అయ్యేదెవరు..!!
టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం. కోల్డ్ వార్ లో మరో అడుగు పడింది. ఇప్పటి వరకు టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చిచేందుకు చిరంజీవి ఇతర ముఖ్యులతో కలిసి ఏపీ సీఎంను కలుస్తారనే చర్చ జరుగుతూ వచ్చింది. కానీ, మెగాస్టార్ మిడిల్ డ్రాప్ అయ్యారు. పంచాయితీలు తాను చేయలేనని తేల్చి చెప్పారు. ఏం జరిగిందో ఏమో కానీ..ఆ వెంటనే సడన్ గా పెదరాయుడు మోహన్ బాబు ముందుకు వచ్చారు. ఎంతో కాలంగా సాగుతున్న సినీ పరిశ్రమ- ఏపీ ప్రభుత్వంతో పరిష్కరించుకోవాల్సిన అంశాల పైన ఇప్పటి వరకు చొరవ తీసుకోలేదు.

చిరంజీవి సడన్ డ్రాప్ వెనుక
తన మౌనం వెనుక కారణాలు ఏంటనేది విశ్లేషిస్తూనే..ఇప్పటి వరకు కొందరు ముందుకొచ్చినా ..సమస్య పరిష్కారానికి ఆచరించిన విధానాలపై తన బహిరంగ లేఖలో కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం వద్దకు ఇద్దరు హీరోలు.. మరో నలుగురు డైరెక్టర్లు - నిర్మాతలు వెళ్లటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. సీనీ సమస్యల పరిష్కారానికి కలిసి రండంటూ మోహన్ బాబు పిలుపునిచ్చారు. దీనీ ద్వారా సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యులు వచ్చి చర్చిస్తే.. పరిశ్రమ తరపున సమస్యల పరిష్కారానికి ఆయన సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారనే చర్చ వినిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో చిరంజీవి ఇప్పటి వరకు సమస్యల పరిష్కారం కోపం నాయకత్వం తీసుకొని.. రెండు సార్లు సీఎం జగన్ తో సమావేశమై.. ప్రతిపాదనలు అందించి.. జగన్ నిర్ణయాలకు మద్దతిస్తూ..ఇప్పుడు ఎందుకు సడన్ గా డ్రాప్ అయ్యారనే చర్చ సైతం మొదలైంది.

మెగాస్టార్ పై ఆశగా ఎగ్జిబిటర్లు
సైరా మూవీ విడుదల తరువాత సీఎం జగన్ ను చిరంజీవి కలిసారు. ఆ సమయంలో సినిమా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని.. పరిశ్రమ సమస్యలు ఏంటో చెబితే పరిష్కరించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ తరువాత నాగార్జున - దిల్ రాజు.. సీ కళ్యాణ్.. రాజమౌళి..దగ్గుబాటి సురేష్ వంటి వారితో కలిసి చిరంజీవి మరోసారి సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాల మొదలు..కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నరిసంహారెడ్డి పేరు పెట్టిన వెంటనే చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు.. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశంతో సినీ ఇండస్ట్రీ -ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరిగింది.

ప్రముఖ హీరోలు ముందుకు రాకపోవటంతో
నేరుగా సినిమా థియేటర్లే మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. మూసి వేసిన థియేటర్లు తెరుచుకొనేందకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. వారికి అన్ని అనుమతులు పొందేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఇక, ఈ అంశాల పైన ప్రభుత్వంతో సంప్రదింపులకు చిరంజీవి ప్రయత్నాలు చేసినా.. సానుకూల స్పందన కనిపించలేదని చెబుతున్నారు. పరిశ్రమలోనూ ఎవరికి వారు స్టేట్ మెంట్స్ ఇవ్వటంతో.. ప్రభుత్వం ముందుకు వెళ్లటానికి చిరంజీవి ముందుకు రాలేదని సమాచారం. దీంతో..దీని నుంచి పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, చిరంజీవి వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మోహన్ బాబు లేఖ రాసారు.

మోహన్ బాబు బాధ్యతలు తీసుకుంటారా
అయితే, పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యం... టిక్కెట్ ధరల విషయంలో జగన్ ప్రభుత్వం వెనుక్కు తగ్గే పరిస్థితులు లేక పోవటంతో మోహన్ బాబు ఈ సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకుంటారా.. సీఎం జగన్ తో చర్చిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తుందనే వాదన ఉంది. సినిమా టిక్కెట్ల పైన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లటంతో పాటుగా.. తాజాగా ఒక బహిరంగ సభలో సైతం జగన్ పదే ప్రజల కోసమే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించామని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా మోహన్ బాబు ప్రచారం నిర్వహించారు. జగన్ ను సీఎంగా చూడాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ లేదా ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా...అమలు కాలేదు.

జగన్ నిర్ణయం మార్చుకుంటారా
అయితే, అదే సమయంలో మోహన్ బాబు ఆకస్మికంగా తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ప్రధాని మోదీని కలిసారు. సీఎం జగన్ తో తరువాత కలిసిని సందర్భాలు లేవనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం జగన్ ను కొందరు అధికారులు తప్పు దోవ పట్టిస్తున్నారంటూ ఫీజు రీ యంబర్స్ మెంట్ వ్యవహారంలో వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పుడు చిరంజీవి మిడిల్ డ్రాప్ తరువాత మోహన్ బాబు బాధ్యత తీసుకొని జగన్ వద్దకు వెళ్లినా...టిక్కెట్ ధరల అంశంలో సీఎం నిర్ణయం మార్చుకుంటారా అనేదే ఇప్పుడు అసలు చర్చ. జగన్ వైఖరి బాగా తెలిసిన మోహన్ బాబు నిజంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా అనేదీ సందేహమే. ఇదే సమయంలో హైకోర్టులో సినిమా టిక్కెట్ల కేసు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా పడింది. దీంతో..ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరిని నాయకత్వం అప్పగించాలి.. సీఎంతో చర్చించే బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే సందిగ్దత నడుమ..ఈ బాధ్యత తీసుకొని..సమస్య పరిష్కరించే హీరో ఎవరనేది రానున్న రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications