స్టీల్ ప్లాంట్ ను ఎన్నికల అజెండాగా మార్చేసిన కేంద్రం ? ఎవరిని ముంచబోతోంది?
ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు రాజధానులు, వైసీపీ ప్రభుత్వ సంక్షేమంతో పాటు పలు అంశాలు అజెండాలో చేరిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వేస్తున్న పిల్లిమొగ్గలు ఈ అంశాన్ని సైతం ఎన్నికల అజెండాలో చేర్చేసినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ పై ఆశతో ఉద్యమాలు చేస్తున్న కార్మికులకు కేంద్ర మంత్రి ప్రకటన, ఆ తర్వాత కేంద్రం మరో ప్రకటన రెచ్చగొట్టినట్టయ్యాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఏపీలో రాజకీయ పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కానీ కార్మికులు మాత్రం ఆశలు వదులుకోకుండా ఇంకా పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ వైజాగ్ స్టీల్ పై పోరాడతామని ప్రకటించింది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్దాయిలో పనిచేయించేందుకు ఆర్ఐఎన్ఐఎల్ అహ్వానించిన బిడ్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి అధికారుల్ని కూడా అక్కడికి పంపింది.

కేసీఆర్ ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ కు సింగరేణి అధికారుల్ని పంపి మైండ్ గేమ్ మొదలుపెట్టారో అప్పుడే కేంద్రానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తామేదో అనుకుంటే కేసీఆర్ తన రాష్ట్రం కాని రాష్ట్రంలో రాజకీయంగా లబ్ది పొందేలా ఉన్నాడని గ్రహించిన కేంద్రం ఉక్కుమంత్రి ఫగన్ సింగ్ కులస్తేను పంపి ప్రైవేటీకరణ ఇప్పుడు లేదని, ప్రస్తుతానికి ప్లాంట్ ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పించేసింది. దాన్ని కూడా కేసీఆర్ సొమ్ము చేసుకుని ఇది తమ విజయంగా ప్రకటించుకున్నారు. ఇక లాభం లేదని కేంద్రం మళ్లీ యూటర్న్ తీసేసుకుంది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటన చేసింది.
కేంద్రం స్టీల్ ప్లాంట్ పై వేసిన పిల్లి మొగ్గలతో ఇప్పుడు ఈ అంశం మరోసారి ఎన్నికల అంశంగా మారిపోతోంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని రెచ్చగొట్టినట్లయింది. దీంతో స్టీల్ ప్లాంట్ దరిదాపులకు వెళ్లేందుకు రాజకీయ పార్టీలు సాహసించలేక పోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేన నేతలు కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి స్టీల్ ప్లాంట్ అంశం తప్పనిసరిగా అధికార పార్టీలైన వైసీపీ, బీజేపీలను ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications