సీఎం జగన్ పై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం - ముఖ్యమంత్రి పంతం వీడేనా..!!
ఇది పేదల ప్రభుత్వం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నిజాయితీగా సంక్షేమం అమలు చేస్తున్న ప్రభుత్వం. సీఎం జగన్ పదే పదే చెప్పే మాట ఇది. అయితే, ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముద్ర లేకుండా చేయటానికి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు వెంటాడుతోంది. టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన అన్నా క్యాంటీన్లను సీఎం జగన్ తన ప్రభుత్వ హాయంలో తొలిగించారు. ఆ తొలిగింపు నిర్ణయం వెనుక ప్రభుత్వం పలు అంశాలను వెల్లడించింది. త్వరలోనే తిరిగి అన్నా క్యాంటీన్ల తరహాలోనే కొత్తవి ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది. కానీ, మూడేళ్లకు పైగా పాలన ముగిసింది.

టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు
ఇప్పటి వరకు పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని టీడీపీ సద్వినియోగం చేసుకోవటం ప్రారంభించింది. ప్రతిపక్షంలో ఉంటున్నా అన్నా క్యాంటీన్లను ఎక్కడికి అక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. తమిళనాడులో జయలలిత హయాంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను ఇప్పుడు స్టాలిన్ సీఎం అయిన తరువాతనూ కొనసాగిస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. కానీ, ఏపీలో మాత్రం ప్రభుత్వం వీటిని అధికారికంగా ఎక్కడా నిర్వహించటం లేదు. కరోనా సమయం నుంచి అనేక మంది ఆదాయాలు కోల్పోయారు. అటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఈ సమయంలో పేదలకు ఈ అన్నా క్యాంటీన్లు.. అన్నపూర్ణ క్యాంటీన్లు ఆసరగా నిలుస్తున్నాయి.

వైసీపీ పై రాజకీయ - సెంటిమెంట్ అస్త్రం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను గతంలో పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పలువురు టీడీపీ నేతలు దాతల సహకారం తీసుకొని మరీ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. గుంటూరు నగరంతో పాటుగా విజయనగరం.. పుట్టపర్తి జిల్లాలోనూ క్యాంటీన్లు టీడీపీ నేతల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
ఆ క్యాంటీన్లకు స్పందన భారీ స్థాయిలోనే ఉంటుంది. దీంతో..ఇప్పుడు ఇది రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారుతోంది. పేదల సంక్షేమంలో తమకు ఎవరూ పోటీ కాదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం..పేదలకు పట్టెడన్నం పెట్టే అంశంలో ఎందుకు ఇంత పట్టుదలకు పోతుందనే ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది.
అన్నా క్యాంటీన్ల పేరు కాకుంటే..మరో పేరుతో అయినా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తే..నిజమైన పేదలకు మేలు జరగటమే కాకుండా..రాజకీయంగానూ వైసీపీ ప్రభుత్వానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

సీఎం జగన్ మనసు మారేనా..
రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల తిరిగి అన్నక్యాంటీన్లను తెలుగుదేశం నేతలు తిరిగి ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని చోట్ల క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని.. 2024లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని స్పష్టంచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో సమీక్ష చేయటం..వాటిలో కొన్నింటిని వెనక్కు తీసుకోవటం జరిగింది.
ఇప్పుడు ఈ క్యాంటీన్ల నిర్వహణ విషయంలోనూ పంతం వీడి తిరిగి వాటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని వైసీపీ నేతలే కోరుతున్నారు. మరి.. సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి












Click it and Unblock the Notifications