మారుపేర్లతో పిలుస్తున్నారు: బెర్లిన్ వేదికగా ఆంధ్రప్రదేశ్కు రాహుల్ గాంధీ హామీ
బెర్లిన్: 2019లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు.

బెర్లిన్ వేదికగా ఏపీ ప్రజలకు రాహుల్ గాంధీ హామీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రకు హామీ ఇచ్చిందని చెప్పారు. ఈ హామీని తాము నెరవేర్చుతామన్నారు. నేను ఏపీ ప్రజలకు హామీ ఇస్తున్నాను.. 2019లో మేం అధికారంలోకి వస్తే మీకు హోదా ఇస్తాను అని బెర్లిన్ వేదికగా చెప్పారు. ఇచ్చిన మాటను మేం తేలిగ్గా తీసుకోమని తెలిపారు.

మోడీ మారుపేర్లతో పిలుస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై దృష్టి సారిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోడీ తనను, ప్రతిపక్షాలను విమర్శిస్తూ, మారుపేర్లతో పిలుస్తున్నారని, కానీ వాళ్లు చేసిన దూషణలు వేగంగా ప్రజల్లోకి వెళ్లాయా, నేను మోడీని ఆలింగనం చేసుకున్న ఘటన వెళ్లిందా అని ప్రశ్నించారు. నిజాలు వెళ్లినంత వేగంగా అబద్దాలు ప్రజల్లోకి వెళ్లవన్నారు.

మోడీ హయాంలో రివర్స్
సాధారణంగా ప్రజలు ఎక్కడైనా న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తారని, కానీ మోడీ హయాంలో మాత్రం ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులే ప్రజల ముందుకు వచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, ఆరెస్సెస్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తాము అంగీకరించబోమన్నారు.

చైనాతో పోటీ
2019 లోకసభ ఎన్నికలపై మాట్లాడుతూ.. తాము ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాగే తయారీ రంగంలో చైనాతో పోటీ పడటం తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. కాగా, రాహుల్ వెంటే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సతీమణి ప్రినీత్ కౌర్ తదితరులు ఉన్నారు. జర్మనీలో రెండు రోజుల పర్యటన అనంతరం అతను బ్రిటన్ బయలుదేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రసంగించనున్నారు.












Click it and Unblock the Notifications