నిమ్మగడ్డ నైతికతపై జగన్ సర్కార్ ప్రశ్నలు.. నియామకం మళ్లీ అటకెక్కుతుందా...!
ఏపీలో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని గవర్నర్ హరిచందన్ జగన్ సర్కారుకు సూచించారు. అయితే ఈ ఆదేశాలు అమలవుతాయా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జారీ చేసిన పలు ఆర్డినెన్స్ లతో పాటు సాంకేతిక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా నిమ్మగడ్డ నియామకం అసాధ్యంగానే కనిపిస్తోంది. వెరసి ఈ వ్యవహారం హైకోర్టు, గవర్నర్ ఆదేశాలు జారీ చేసినంత సులువుగా తేలేలా కనిపించడం లేదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ఈసారి ఎలాగైనా తనకు పదవి దక్కుతుందని ఆశాభావంగా కనిపిస్తున్నారు.
జగన్కు దారులన్నీ క్లోజ్, ఆర్టికల్ 243కే(2)కు సార్ధకత.. నిమ్మగడ్డ రమేశ్ ఇష్యూపై ప్రతిపక్షాలు..
గవర్నర్ ఆదేశాల తర్వాత...
విభిన్న సంక్లిష్టతలతో ముడిపడి ఉన్న నిమ్మగ్డడ రమేష్ కుమార్ వ్యవహారంలో అప్పటి వరకూ ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సానుకూల ఆదేశాలే ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని జగన్ సర్కారుకు సూచించారు. కానీ అంతటితో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే అంత సులువుగా ఈ వ్యవహారం పరిష్కారమయ్యేలా ఉంటే నిమ్మగడ్డ ఎప్పుడో గవర్నర్ ను ఆశ్రయించేవారు. కానీ ఆయన అలా చేయలేదు. హైకోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అందులోనూ ఎన్నో సంక్లిష్టతలు, పరస్పర విరుద్ధమైన అంశాలూ ముడిపడి ఉన్నాయి.
నిమ్మగడ్డ నియామకంలో సంక్లిష్టతలివే...
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా నిమ్మగడ్డ పునర్ నియామకం విషయంలో జగన్ సర్కారు ముందుకెళుతుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే తాము ఉద్దేశపూర్వకంగా తొలగించిన నిమ్మగడ్డను చేతులారా నియమించేందుకు ప్రభుత్వానికి ఎలాగో మనసొప్పదు. అదే సమయంలో ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో తొందరపడటానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే సుప్రింకోర్టులో అంతిమ తీర్పు రాకముందే తమ పరిధిలో లేదని హైకోర్టు గతంలో తేల్చిచెప్పిన ఈ వ్యవహారంలో తాము మాత్రం ఎందుకు అంతిమ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావించవచ్చు. అలాగే నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసింది. అయితే జస్టిస్ కనగరాజ్ నియామకంపై ఆర్డినెన్స్ మాత్రం ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఉపసంహరించుకోలేదు. అంటే కనగరాజ్ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడంతో పాటు నిమ్మగడ్డ నియామకంపై గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
జగన్ ముందు ఆప్షన్స్ ఇవే
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకాన్ని జాప్యం చేసేందుకు లేదా పక్కనబెట్టేందుకు జగన్ సర్కారు ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ప్రధానమైనది సుప్రీంకోర్టు కేసు. సుప్రీంకోర్టులో ఓవైపు రెండు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో హడావిడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ కు చెప్పడం, హైకోర్టే గతంలో ప్రభుత్వానికి ఎస్ఈసీని నియమించే అధికారం లేదని చెప్పడం, గవర్నర్ ఇంకా జస్టిస్ కనగరాజ్ నియామక ఆర్డినెన్స్ ఉపసంహరించుకోకపోవడం వంటి అంశాలు జగన్ సర్కారుకు కలిసి వచ్చే అవకాశముంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం దీన్ని సాగదీసే కొద్దీ నిమ్మగడ్డ మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video
నిమ్మగడ్డకు సర్కారు ప్రశ్నలు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరు సరిగా లేదని రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రవర్తించడం లేదని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే నిమ్మగడ్డ నియామకం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి సులువుగా అర్ధమవుతుంది.