కీ రోల్ ఛాన్స్: విలీనం చేయాలని కెసిఆర్ను కోరిన డిగ్గీ!
విలీనంపై కచ్చితమైన హామీ ఇస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని, ఎటువంటి కష్టనష్టాలెదురైనా పార్లమెంట్లో అనుకున్న విధంగా బిల్లు ఆమోదం పొందేలా చేస్తామని డిగ్గీ చెప్పగా, విభజన కచ్చితంగా జరుగుతుందనుకుంటే విలీనానికి తాము సిద్ధమేనని, కెసిఆర్ చెప్పారట.
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనే ఇరువర్గాలకు మంచిదని తమ పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారని, అయితే విలీనానికి కూడా తమకు అభ్యంతరం లేదని కెసిఆర్ వివరించారని సమాచారం. విభజన ప్రక్రియను బిజెపి పరోక్షంగా అడ్డుకోవడం, సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయడం ఇలాంటి పరిణామాల మధ్య బిల్లు ఆమోదంపై కెసిఆర్ అనుమానం వ్యక్తం చేయగా, ఆ విషయాలు తమకు వదిలేయాలని, విలీనానికి ఒకే చెబితే అంతా సవ్యంగా జరుగుతుందని కెసిఆర్కు డిగ్గీ హామీ ఇచ్చారట.
విభజన, విలీనం తర్వాత జాతీయ స్థాయిలో కూడా కీలకపాత్ర పోషించే అవకాశం కల్పిస్తామని కెసిఆర్కు కల్పిస్తామని చెప్పారట. పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే విలీనంపై కెసిఆర్ ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు విలీనం వార్తలపై తెరాస స్పందిస్తూ... బిల్లు ఆమోదం పొందేదాక కెసిఆర్ ఆ అంశంపై మాట్లాడరని చెప్పారు.