25 మంది కీలక నేతలతో భేటీ, త్వరలో పూర్తి వివరాలు: త్వరలో పవన్ సంచలన ప్రకటన?
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో సంచలన ప్రకటన చేయనున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పలువురు కీలక నేతలు ఆయనతో భేటీ అయ్యారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. దాదాపు 25 మంది ముఖ్య నేతలు ఇటీవలి కాలంలో పవన్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
'చంద్రబాబు కొత్త సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్'
ఈ విషయమై పవన్ త్వరలో సంచలన ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పవన్ అభిమాని దిలీప్ సుంకర ఈ విషయం వెల్లడించారు. జనసేన అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న అతను ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ నుంచి కీలక ప్రకటన
దీనిని బట్టి మరో నెల రోజుల్లో పవన్ నుంచి కీలక ప్రకటన రాబోతుందని అంటున్నారు. పవన్తో భేటీ అయిన ఆ 25 మంది ప్రముఖులు ఎవరు అనే చర్చ సాగుతోంది. ఇది అందరిలోను ఉత్కంఠను రేపుతోంది. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు పవన్ ఆ విషయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.
ఆ 25 మంది పేర్లు వెల్లడి
సమయం, సందర్భాన్ని బట్టి ఆ 25 మంది పేర్లను పవన్ కళ్యాణ్ బయటపెడతారని ఆయన తెలిపారు. ఆ విషయం దాచిపెట్టి ముందుకు వెళ్లే ఉద్దేశం పవన్కు లేదని చెప్పారు. మూడేళ్ల క్రితమే జనసేన నియామకాలు జరిగాయని ఆయన చెప్పడం గమనార్హం.
త్వరలోనే పేర్లు బయటకు
తెలంగాణకు ఇంచార్జిగా శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, మీడియా హెడ్గా హరిప్రసాద్ ఉన్నారని ఆయన తెలిపారు. మరో నెల రోజుల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట తీరును చూస్తే త్వరలోనే పవన్ ఆ 25 మంది ప్రముఖుల పేర్లను వెల్లడించే అవకాశం ముందని అంటున్నారు.
ఎవరు, ఏ పార్టీ వారు
కాగా, పవన్ కళ్యాణ్తో అంతమంది కీలక నేతల భేటీ అనే ప్రచారం నేపథ్యంలో.. ఆయన లోలోన 2019 ఎన్నికల కోసం పూర్తిగా సన్నద్ధమవుతున్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. అయితే ఆ కీలక నేతలు ఎవరు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారు, ఏఏ పార్టీల నుంచి ఉన్నారు, లేదా ఇతరులా అనే చర్చ సాగుతోంది.