పవన్ vs జగన్, ఒకేరోజు పిఠాపురంలో ?, ఎవరికి చాన్స్ ఇస్తారో ? సర్వర్ డౌన్ సార్, స్వామి భక్తి !
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను మరోసారి వైసీపీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని, చట్టపరంగా అధికారులు నడుచుకోకుంటే భవిష్యత్తులో అలాంటి అధికారులకు చుక్కలు చూపిస్తామని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు హెచ్చరించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్ షోకు అడ్డంకులు సృష్టించడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనసేన నాయకులు మండిపడుతున్నారు.
ఈనెల 10వ తేదీన జనసేన అధినేత, పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ పిఠాపురంలో రోడ్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు మంగళవారం పిఠాపురంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. అయితే ఉదయం వెళ్లిన కూటమి నాయకులకు సర్వర్ పని చెయ్యడం లేదని చెప్పిన ఆర్వో కార్యాలయం అధికారులు వారిని సాయంత్రం 6.30 గంటల వరకు అక్కడే వేచి ఉండేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తరువాత కూటమి నాయకుల నుంచి అర్జీ స్వీకరించిన అధికారులు వారికి ఒక ఓటీపీ నెంబర్ ఇచ్చి అర్జీ పరిశీలించి తరువాత నిర్ణయం తీసుకుంటామని అక్కడి నుంచి పంపించేశారని కూటమి నాయకులు అంటున్నారు. ఇదే నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా పిఠాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకే రోజు ఒకే ఊరిలో సీఎం జగన్, పవన్ కల్యాణ్ రోడ్ షో ఉండటంతో అధికారులు ఎవరికి అనుమతి ఇస్తారు అని ఆసక్తికరంగా మారింది.

అయితే ముందుగా ఎవరు అర్జీ ఇస్తారో వారికే అనుమతి ఇవ్వాలని టీడీపీ నాయకుడు వర్మా అంటున్నారు. తాను అధికారులతో మాట్లాడానని, పవన్ కల్యాణ్ రోడ్ షోకు అనుమతి ఇస్తారని బావిస్తున్నానని వర్మా చెప్పారు. అయితే సీఎం జగన్ బహిరంగ సభకు వైసీపీ నాయకులు అనుమతి తీసుకున్నారా ? లేదా ?, అసలు అర్జీ సమర్పించారా ? అనే విషయం మాత్రం అధికారులు చెప్పడం లేదని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మా అంటున్నారు.
పిఠాపురంలో మరోసారి పవన్ కల్యాణ్ కు ఆటంకం కలిగించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, కావాలనే మా ఓపికను పరీక్షిస్తున్నారని జనసేన, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈనెల 10వ తేదీన పవన్ కల్యాణ్ రోడ్ షో ఉంటుందా ?, లేక సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుందా అని సమాచారం తెలుసుకోవడానికి పిఠాపురం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు రోజులు దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications