సాయిరెడ్డికి రాజ్యసభ డౌటేనా.!!? తెర మీదకు "మెగా" ప్రొడ్యూసర్ - లెక్కలు మారుతున్నాయి..!!
వైసీపీలో రాజకీయంగా నిర్ణయాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత వారిని తప్పించి కొత్త వారికి కేబినెట్ లో అవకాశం అని తొలుత చెప్పినా.. చివరకు కేబినెట్ లో పాత - కొత్త మంత్రుల ఫార్ములా అమలు చేసారు.
అదే విధంగా కొత్త వారిలో అవకాశాలు..సామాజిక సమీకరణాలు ఆసక్తి కర చర్చకు కారణమయ్యాయి. అదే విధంగా పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఊహించినట్లుగానే ఎంపిక జరిగినా..రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం లో మాత్రం ట్విస్టులు తప్పలేదు. పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి పూర్తిగా సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి... పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ గా నియమించారు.
సాయిరెడ్డికి కొత్త బాధ్యతలతో చర్చ మొదలు
పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా అనుబంధ విభాగాలను సమన్వయం చేసుకోనున్నారు. ఇక, ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు ఆ పదవి రెన్యువల్ అని కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ, కొన్ని కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
అందులో ఒకటి సాయిరెడ్డికి రెన్యువల్ అని అందరూ భావిస్తున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి మైనార్టీ..మరకొటి ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీమణి..మరొకటి బీసీ లేదా ఎస్సీ కి కేటాయిస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఇప్పుడు సడన గా రెడ్డి వర్గం నుంచి కొత్త పేరు పార్టీలో ప్రచారం సాగుతోంది.
పార్టీ నేతల్లో ఆ నిర్మాత పేరు ప్రచారం
న్యాయవాదిగా.. నిర్మాతగా వ్యవహరిస్తున్న నిరంజన్ రెడ్డి పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందని పార్టీలో కొందరు ముఖ్యుల వద్ద చర్చ సాగుతోంది. చిరంజీవి- రాం చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీకి ఆయన నిర్మాతగా ఉన్నారు. సీఎం జగన్ తో పాటుగా చిరంజీవితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆలీ వైపు సీఎం మొగ్గు చూపినట్లు ప్రచారం సాగింది. అయితే, ఆలీకి వారం పది రోజుల్లో గుడ్ న్యూస్ అని చెప్పినా...ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడ లేదు. దీంతో..ఇప్పుడు సాయిరెడ్డికి రెన్యువల్ చేయకుండా నిరంజన్ రెడ్డికి కేటాయిస్తారా లేక..నాలుగు సీట్లలో రెండు రెడ్డి వర్గానికి కేటాయించి..సాయిరెడ్డిని కొనసాగిస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
వైసీపీ నుంచి నలుగురు సభ్యులు
ఇక, రెండో స్థానం బీసీ వర్గం నుంచి బీదా మస్తాన రావు పేరు రేసులో ఉంది. బీదా మస్తానరావు సైతం నెల్లూరు జిల్లా వాసే. సాయిరెడ్డి సొంత జిల్లా సైతం నెల్లూరు. అయితే, మూడో స్థానం మాత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు ఖాయమని చెబుతున్నారు. నాలుగో స్థానం పైనా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక, ఇదే సమయంలో సజ్జల..వైవీ సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ సీటు కోసం రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా...తాజాగా వారికి అప్పగించిన పార్టీ బాధ్యతల ద్వారా ఆ ఇద్దరికీ ఛాన్స్ లేదనేది స్పష్టం అవుతోంది. అయితే, పార్టీ ఏర్పాటు సమయం నుంచి సీఎం జగన్ కు విధేయుడిగా..అన్ని వేళలా అండగా నిలిచిన సాయిరెడ్డిని కాదని మరొకరికి రాజ్యసభ ఇస్తారా అనేది ఇప్పుడు పార్టీలో బిగ్ డిబేట్ గా మారుతోంది.
జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
అయితే, రాజకీయ నిర్ణయాల్లో సీఎం జగన్ ఎవరికీ అంతు చిక్కరనే వాదన మొదలైంది. పార్టీలోని సీనియర్లు మాత్రం ఎవరికి మిగిన మూడు స్థానాల్లో అవకాశం ఇచ్చినా..విజయ సాయిరెడ్డికి మాత్రం రెన్యువల్ ఖాయమని చెబుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా..కేంద్రం - రాష్ట్రం సంబంధాల మధ్య కీలకంగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో పదవి కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో..ఇప్పుడు రాజ్యసభకు వైసీపీ నుంచి ఎంపియ్యే నలుగురు సభ్యుల తుది ఎంపిక పైన సీఎం జగన్ నిర్ణక్ష్ం ఎలా ఉంటుందనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.