అమరావతిపై జగన్ స్టాండ్ మారిందా ? అవినీతికు బదులు తెరపైకి ఖర్చు-ఢిల్లీ ఫోన్ కాల్ ప్రచారం
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏనాడూ జగన్ సర్కార్ దానికి సంపూర్ణంగా మద్దతునిచ్చింది లేదు. శాసనసభలో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు జగన్ గతంలో ప్రకటించినా మరోవైపు రాజధాని శంఖుస్ధాపనకు రాకపోవడం, ఆ తర్వాత కూడా దీన్ని టీడీపీ సర్కార్ లోని మంత్రులు, సీఎం చంద్రబాబు కుంభకోణంగా అభివర్ణించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కోర్టుల్లో కేసులు వేయడం, వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఏసీబీ, సీఐడీ విచారణలు చేయించడం, అమరావతి రైతుల్ని కేసులతో వేధించడం, చివరకు వారి పాదయాత్రకు సైతం ఆటంకాలు కల్పించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘటనలు. అయితే తాజాగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల రద్దు సందర్భఁగా ప్రభుత్వం అమరావతి జపం చేస్తోంది.

అమరావతిపై జగన్ ప్రేమ
అమరావతిని గత ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా ప్రకటించగానే వైసీపీ భగ్గుమంది. టీడీపీ సర్కార్ ఎవరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించడం మొదలుపెట్టింది. చివరికి అమరావతిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాత్రం జగన్ ఇష్టమున్నా లేకపోయినా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ తర్వాత రాజధాని శంఖుస్ధాపనకు టీడీపీ సర్కార్ ఆహ్వానించినా జగన్ వెళ్లలేదు. అంతటితో ఆగకుండా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు మొదలుపెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ప్రకటన చేయడమే కాకుండా నిరసనల పేరుతో అడ్డొచ్చిన రైతులపై కేసులు పెట్టి వేధించారు. రెండేళ్లుగా సాగుతున్న అమరావతి ఉద్యమాన్ని చులకన చేస్తూ సీఎం జగన్, మంత్రులు చేయని విమర్శలు లేవు.

వ్యతిరేకత లేదన్న జగన్
అయితే తాజాగా మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్ అమరావతి ఉద్యమాన్ని ప్రస్తావించారు. అమరావతి ప్రాంతంపై తనకు ఏమాత్రం వ్యతిరేకత లేదన్నారు. అంతేకాదు తనకు ఈ ప్రాంతమంటే చాలా ప్రేమ అని కూడా పేర్కొన్నారు. మూడు రాజధానుల్ని అమరావతిలో ఉన్న ఒక శాతం ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, వారిని కూడా ఒప్పించి, వారిలో అపోహలు తొలగించాకే మూడు రాజధానులపై మరో బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పుకొచ్చారు. దీంతో అమరావతిపై జగన్ వైఖరిలో వచ్చిన మార్పు చూసి జనం నివ్వెరపోతున్నారు.

అమరావతిపై ఆరోపణలకు దూరం
గతంలో జగన్ అమరావతి పేరెత్తితేనే అవినీతి, కుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, నేతలు, చంద్రబాబు, లోకేష్ గురించి ప్రస్తావించేవారు. వారంతా కలిసి అమరావతిలో భూముల కుంభకోణం చేశారని, దీనిపై సీబీఐ దర్యాప్తు వేయాలని కేంద్రాన్ని కూడా అభ్యర్ధించారు. కానీ కేంద్రం దీనికి ఒప్పుకోలేదు. అయినా జగన్, వైసీపీ మంత్రుల ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా మూడు రాజధానుల బిల్లుల రద్దు సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన జగన్.. ఇందులో అమరావతిలో అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, భూకుంభకోణం వంటి అంశాల్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు.

అమరావతిలో ఖర్చే టార్గెట్
అమరావతిలో రాజధాని నిర్మించాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఎకరానికి 2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలను కనీసం అభివృద్ధి చేయాలన్నా లక్ష కోట్లు ఖర్చవుతాయని జగన్ తెలిపారు. ఇది తన లెక్క కాదని టీడీపీ ప్రభుత్వం గతంలో వేసిన లెక్కే అని జగన్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దీంతో అమరావతిలో భారీగా ఖర్చుపెట్టి రాజధాని కట్టడం కంటే అన్ని వసతులు ఉన్న రెడీమేడ్ విశాఖకు వెళ్లడమే మంచిదని జగన్ చెప్పుకొచ్చారు. అంటే గతంలో తాము ప్రకటించిన మూడు రాజధానులకు కట్టుబడుతూనే అమరావతిని ఎందుకు వదిలేయాల్సి వస్తుందో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు అమరావతిలో అయ్యే ఖర్చును జగన్ టార్గెట్ చేశారు.

జగన్ నిర్ణయం వెనుక ఢిల్లీ ఫోన్ కాల్ ?
అమరావతిపై జగన్ సర్కార్ తమ నిర్ణయం మార్చుకోవడం వెనుక ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్ కారణమనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమయ్యాయని తెలుస్తోంది. అమిత్ షా టూర్ లో బీజేపీ నేతలకు అమరావతిపై ఉద్యమించాలని కోరారు. ఇలా అమిత్ షా చెప్పడం వెనుక అప్పటికే కేంద్రం దీనిపై తీసుకున్న స్టాండే కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత జగన్ కు ఫోన్ చేసి అమిత్ షా ఫోన్ చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంత సడన్ గా జగన్ తన స్టాండ్ మార్చుకుని అమరావతిపై ఆరోపణలు చేయకుండా విశాఖకు రాజధానిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గి ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications