ఆ భయంతోనే మధుపై శిల్పా వర్గీయుల దాడి, జగన్ మాట మీద నిలబడాలి: సోమిరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతోనే గురువారం అభిరుచి మధుపై శిల్పా వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు.
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతోనే గురువారం అభిరుచి మధుపై శిల్పా వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతోనే వైసీపీ నేతలు హింసకు దిగుతున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 25 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో అధికార దుర్వినియోగం జరిగిందన్న ప్రచారం అవాస్తవమన్నారు. మూడేళ్ల పాలనకు రెఫరెండంగా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అని చెప్పిన జగన్, తన మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని రైతులకు మూడో విడత రుణమాఫీకి పది శాతం వడ్డీతో కలిపి రూ. 3,600 కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. గతేడాది కన్నా ఈ ఏడాది 30 శాతం అధికంగా సాగు జరుగుతోందని- ఒక్క కర్నూల్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు.
ప్రకృతి విపత్తులకు గురైన రైతులకు పరిహారం నగదు నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ అవుతోందన్నారు. వ్యవసాయశాఖను గాలికొదిలేసి తాను ఉప ఎన్నికలకు మాత్రమే పరిమితం అయ్యారనే ఆరోపణల్ని ఆయన ఖండించారు.
శాఖా పరంగా చేపట్టాల్సిన బాధ్యతలను అధికారులకు అప్పగించి ఎన్నికల ప్రచారానికి వెళ్ళానని స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేత జగన్ తన బాధ్యతను మరిచి నంద్యాలలోనే మకాం వేశారని అన్నారు.